రైతు ప్రయోజనాల కోసం పరిశోధించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:40 AM
వ్యవసాయ రంగానికి పరిశోధనలు ఉపకరించాలి
ఏర్పేడు, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): మట్టిలోని జీవకణాలు, కార్బన్ మీద దృష్టి తగ్గిపోతున్న క్రమంలో అన్నదాతలతో కలిసి యువ శాస్త్రవేత్తలు పనిచేయాలని గోదావరి బయోరిఫైనరీస్ లిమిటెడ్, సోమయ్య విద్యావిహార్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ సమీర్ సోమయ్య పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి పరిశోధనలు ఉపకరించాలన్నారు. ఏర్పేడు సమీపంలోని ఐసర్లో మంగళవారం జరిగిన ఆరో స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. తాము పంచగవ్య, జీవామృతం వంటి సంప్రదాయక విధానాలను పరిశీలించి, శాస్ర్తీయంగా పరిశోధించి వాటిని ఆధునిక పద్ధతులతో మిళితం చేస్తున్నామన్నారు. ఈ కృషి ఫలితంగా ఉత్తర కర్ణాటకలోని ఓ రైతు సగటున 30 టన్నులకు బదులుగా 120 టన్నుల చెరకు దిగుబడి సాధించారన్నారు. తమిళనాడులో పుట్టిన మణి అనే బాలుడు మేకను విక్రయించిన డబ్బుతో చదువును సాగించాడన్నారు. ఇప్పుడు బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఎదిగిన ఆయనతో కలిసి ప్రస్తుతం మన దేశంలోనే ఔషధ పరిశోధన కేంద్రాన్ని స్థాపిస్తున్నామని చెప్పారు. ఐసర్ బోర్డు ఆఫ్ గవర్నస్ చైర్పర్సన్ ఝిల్లు సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యవసాయం, సస్టైనబుల్ కెమిస్ర్టీ, సెమీకండక్టర్, ఎంజైమ్ తయారీ రంగాల్లో పరిశోధనలు చేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా రెండేళ్ల మాస్టర్ బై రీసెర్చ్(ఎంఎ్స-ఆర్) కోర్సును ప్రారంభించనున్నట్టు డైరెక్టర్ శాంతను భటాచార్య వెల్లడించారు.