పార్థీ గ్యాంగ్ పనేనా?
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:57 AM
పథకం ప్రకారమే రైలులో దోపిడి విచారణ ముమ్మరం చేసిన పోలీసులు భయాందోళనలో ప్రయాణికులు
చిత్తూరు రూరల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు సమీపంలోని సిద్ధంపల్లె రైల్వేస్టేషన్కు కూతవేటు దూరంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి మరీ గురువారం రైలులో దోపిడీ చేసిన విషయం తెలిసిందే. ఈ దోపిడి ఒక పథకం ప్రకారమే జరిగినట్లు రైల్వే పోలీసులు తేల్చారు. దీనివెనుక మహారాష్ట్రకు చెందిన పార్థీగ్యాంగ్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం రైల్వే, రాష్ట్ర పోలీసులు కలిసి ప్రత్యేక టీమ్గా ఏర్పడి జల్లెడ పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి వాహనంలో వచ్చారా? అన్న కోణంలో టోల్గేట్లలో తనిఖీ మొదలు పెట్టారు. ఇప్పటికే ఘటన స్థలంలో.. ఫింగర్ప్రింట్ సేకరించారు. డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా పరిశీలించారు.
నెల రోజుల్లో మూడుచోట్ల..
నెల రోజుల వ్యవధిలోనే ఇదే తరహా దోపిడీలు మూడు చోట్ల జరిగాయని సమాచారం. రెండు.. తిరుపతి సెక్షన్ పరిధిలోని ముంగిలిపట్టులో జరిగితే మూడోది.. చిత్తూరు సెక్షన్ పరిధిలోని సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. ఈ మూడు దోపిడీలు ఒకేలా ఉండడంలో అధికారులు ఒకే ముఠా పనేనని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల గుంతకల్లు, గుత్తి, రేణిగుంట, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఇటువంటి దోపిడీలు జరిగినట్లు తెలుస్తోంది. చిత్తూరులో ఇలాంటి దోపిడీ ఇదే మొదటిదని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో జరిగిన మూడు దోపిడీల్లో సుమారు 250 గ్రాములకుపైగానే బంగారునగలు దోచుకున్నట్లు తెలిసింది. వరుస దోపిడీలతో రైలు ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగారం ధర పెరగడం కూడా ఒక కారణం
ఇటీవల బంగారం ధర పెరిగిపోవడం వల్ల కూడా దుండగులు ఇలాంటి దోపిడీలు చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం మారుమూల రైలు రూట్లను ఎంచుకుంటున్నారు. సిగ్నల్ వైరు కట్ చేసి.. రైలు ఆగేలా చేయడం.. ఆవెంటనే దోపిడీ చేసి పరారవుతున్నారు. ఈ దోపిడీని రైలులోని ఆర్పీఎఫ్ పోలీసులు తెలుసుకునేలోపే దుండగులు మాయమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సిగ్నల్ వ్యవస్థను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సి ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.
రైల్వే పోలీసులు నిర్లక్ష్యం కూడా కారణమా?
రైల్వే పోలీసులు నిర్లక్ష్యం కూడా దోపిడీకి కారణమని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలులో గస్తీ నిర్వహించే పోలీసులు ఎవరైనా అనుమానితులు కనిపిస్తే విచారించాలి. అదుపులోకీ తీసుకోవాలి. వీరు నిర్లక్ష్యంగా ఉండటంతోనే దోపిడీలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఇదే విషయమై వీరికి గురువారం మధ్యాహ్నం ఓ ఉన్నతాధికారి క్లాసు తీసుకున్నారు. మీ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గస్తీ సిబ్బంది సుమారు 50 శాతం వరకు కొరత ఉందని తెలుస్తోంది. రెండు మూడు రైలు పెట్టెలకు ఒక్కో పోలీసు ఉండాల్సి ఉండగా.. రైలు మొత్తానికి ఇద్దరే ఉంటున్నారని సమాచారం.