ఎరువులు దుకాణాల్లో కొనసాగిన తనిఖీలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:25 AM
జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారమైన రెండో రోజూ ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారమైన రెండో రోజూ ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఆదేశాల మేరకు పలమనేరు, తవణంపల్లి, పెద్దపంజాణి, పుంగనూరు మండలాల్లోని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేశారు. కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ ఎన్.సాలురెడ్డి, రేణిగుంట ఎంఏవో పి.సునీల్కుమార్రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఎరువుల దుకాణాలు తనిఖీలు చేశాయి. ఎరువుల దుకాణాల్లో రికార్డులు, గోడౌన్లలో తనిఖీల అనంతరం రూ.12.39 లక్షలు విలువ చేసే 13 మెట్రిక్ టన్నుల అనధికార ఎరువులు, ఇతర విక్రయాలు గుర్తించిన అధికారులు వాటి అమ్మకాలను నిలుపుదల చేశారు. దీనిపై దుకాణదారులకు సైతం షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.