బెయిలొచ్చిందా తిరిగొస్తే ఒట్టు
ABN , Publish Date - May 17 , 2025 | 01:53 AM
బెయిల్తో బయటకొచ్చే గంజాయి బ్యాచ్.. మళ్లీ కనిపించడం లేదు. కోర్టు విచారణకు రావడంలేదు.
బెయిల్తో బయటకొచ్చే గంజాయి బ్యాచ్.. మళ్లీ కనిపించడం లేదు. కోర్టు విచారణకు రావడంలేదు. ఇలా ఉమ్మడి జిల్లాలో బెయిల్ పొందిన వారిలో ంకా 920 మంది తప్పించుకు తిరుగుతున్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నిందితుల్లో అత్యధికులు ఇతర రాష్ట్రాల వారే.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి
గత ఐదు సంవత్సరాల్లో గంజాయి కేసుల్లో పట్టుబడి జైలుకు వెళ్లారు. కొంత కాలం జైళ్లలో ఉండి.. బెయిల్పై బయటకు వస్తున్నారు. ఆ తర్వాత కోర్టు విచారణకు హాజరు కావడంలేదు. దీనిపై విచారిస్తున్న న్యాయమూర్తులు నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నారు. వారిలో చాలా మంది జాడ కూడా కనిపించడంలేదు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిని విచారించే సమయంలో మరికొందరు బయట వ్యక్తుల ప్రమేయమూ వెలుగు చూస్తోంది. పోలీసులు వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్టు చేయడానికి వెళ్తే పత్తా లేకుండా పోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 1020 మంది గంజాయి నిందితులు తప్పించుకుని తిరుగుతుండగా.. ఏడాది కాలంలో దాదాపు 100 మందిని పట్టుకున్నారు. మిగిలిన 920 మంది కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఇలా తప్పించుకుని తిరుగుతున్న వారిలో ఇతర రాష్ట్రాల వారు.. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వాళ్లు అధికంగా ఉన్నట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. కోర్టు వాయిదాలకు హాజరు పరచాలని సమన్లు జారీ అవుతున్నా నిందితుల ఆచూకీ దొరకడంలేదు. దీంతో కేసుల పురోగతి ముందుకు సాగడంలేదు.
102 మందిపై గంజాయి షీట్లు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 102 మంది స్మగ్లర్లపై గంజాయి షీట్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కూ టమి అధికారంలోకి వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గత తొమ్మిది నెలల వ్యవధిలో దాదాపు పది వేల కిలోల గంజా యిని పట్టుకున్నారు.ఇందులో 310 మందికిపైగా అరెస్టు అయ్యారని సమాచారం. ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడుతున్న వారిపై గంజాయి షీట్లు తెరిచారు. మరో 20 కేసుల్లో నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.