‘స్వర్ణ’ పంచాయతీలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:38 AM
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలనే మహాత్ముడి భావనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. అధికారంలోకి వచ్చాక పూర్తిగా గ్రామీణాభివృదిఽ్ధపై ప్రత్యేక దృష్టి సారించింది. గత వైసీపీ పాలనలో అతీగతీలేకుండా పోయిన పల్లెల పాలనా వ్యవస్థను చక్కదిద్దాలని సంకల్పించింది.
అందుబాటులోకి సరికొత్త పోర్టల్
ఆన్లైన్ విధానంతో ఇక లెక్కలు పక్కా
అవినీతి, అక్రమాలకు ఫుల్స్టాప్
తిరుపతి (కలెక్టరేట్), సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పల్లెలే దేశానికి పట్టుగొమ్మలనే మహాత్ముడి భావనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. అధికారంలోకి వచ్చాక పూర్తిగా గ్రామీణాభివృదిఽ్ధపై ప్రత్యేక దృష్టి సారించింది. గత వైసీపీ పాలనలో అతీగతీలేకుండా పోయిన పల్లెల పాలనా వ్యవస్థను చక్కదిద్దాలని సంకల్పించింది. ఈక్రమంలోనే సోమవారం 1 నుంచి ‘స్వర్ణ పంచాయతీ’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గ్రామ పంచాయతీల్లో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు, అక్రమాలను కట్టడి చేసేందుకు ఈ సరికొత్త ఆన్లైన్ పోర్టల్ దోహదపడనుంది.
పూర్తిగా డిజిటల్ లావాదేవీలు
జిల్లాలోని 774 గ్రామ పంచాయతీల్లోని కార్యకలాపాల్లో ఎక్కువ భాగం ఇప్పటివరకూ మాన్యువల్గా జరగుతున్నాయి. రూపాయి పన్ను చెల్లించాలన్నా ప్రజలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సిందే. రసీదు కోసం ఇబ్బందులు పడాల్సిందే. రసీదు పొందకపోతే ఆ పన్ను ప్రభుత్వ ఖజానాకు జమయిందో లేదో అని సంశయం. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడుతుంది. ఆన్లైన్ ద్వారా పన్నులు చెల్లించే అవకాశం ఏర్పడింది. ఇంటి, కుళాయి పన్నులు, మ్యూటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, బర్త్, దెత్ సర్టిఫికెట్, మ్యారెజ్ సర్టిఫికెట్ వంటి సేవలనూ ఇందులో పొందవచ్చు. పోర్టల్లో క్యూఆర్ కోడ్ను స్కాన్చేసి నగదు చెల్లించాక పంచాయతీ అధికారులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీంతో పంచాయతీకి సంబంధించి ఏరోజుకారోజు లెక్కలు ఇట్టే తెలిసిపోతాయి. లోపాలకు,అక్రమాలకు తద్వారా బ్రేకు పడుతుంది. ఇంటి యజమాని పేరు, పన్నుల సంఖ్య, నివాస ప్రాంతం గృహం, వాణిజ్య భవనమా, పారిశ్రామిక అవసరాలకు నిర్మించారా, గ్రామకంఠంలో నిర్మించారా.. అనుమతులున్నాయా తదితర పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది.
వైసీపీ హయాంలో లెక్కకు దొరకని అవినీతి
గత వైసీపీ ప్రభుత్వం గ్రామాలను గాలికొదిలేసింది. ఆర్థిక సంఘం నిధులే కాదు ఉపాధి హామీ పనులనూ దారి మళ్లించేసింది. ఇదే అదనుగా పంచాయతీల్లో కొందరు పంచాయతీ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లు చేతివాటం ప్రదర్శించారు. ఆస్తి పన్నులను అడ్డదారిలో బొక్కేశారు. రేణిగుంట, తిరుచానూరు. తారకరామనగర్తో పాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో సుమారు రూ.5కోట్ల మేర అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని పంచాయతీల్లో పనులు చేయకుండానే వైసీపీ నేతలు బిల్లులు పొందారనే విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
పంచాయతీల్లో పారదర్శకత
గ్రామ పంచాయతీల్లో అక్రమాలకు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఫుల్స్టాప్ పెడుతుంది. ఈ ఆన్లైన్ పద్ధతి వల్ల అక్రమాలకు, అవినీతికి ఆస్కారం ఉండదు. పంచాయతీ పన్నులతో పాటు ఆస్తుల వివరాలను సమగ్రంగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
- సుశీలాదేవి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి
=======================
జిల్లాలో గ్రామ పంచాయతీలు: 774
పన్నుల అసెస్మెంట్లు : 3,56,669
ఏటా ఇంటిపన్ను వసూలు: రూ.39.72కోట్లు