Share News

భూముల సర్వేపై రైతుల అభ్యంతరం

ABN , Publish Date - May 08 , 2025 | 01:43 AM

ప్రతి రైతుకూ న్యాయం చేస్తామన్న ఎమ్మెల్సీ కంచర్ల

  భూముల సర్వేపై రైతుల అభ్యంతరం
రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కంచర్ల, కడ పీడీ వికాస్‌

శాంతిపురం/రామకుప్పం, మే7(ఆంధ్రజ్యోతి): శాంతిపురం, రామకుప్పం మండలాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టుకు భూములిచ్చే రైతులందరికీ ప్రభుత్వం ద్వారా న్యాయం జరిపిస్తామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కడ సీడీ వికాస్‌మర్మత్‌ హామీ ఇచ్చారు. శాంతిపురం మండలంలోని దండికుప్పం, సిద్దారెడ్లపల్లె, జీడిగుట్ల గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఎయిర్‌పోర్టుకు భూముల సేకరణ కోసం చేపట్టిన సర్వేపై అభ్యంతరం తెలిపారు. వైసీపీ నేతలు కొందరు కూడా అక్కడకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.నిజానికి ఎయిర్‌పోర్టు భూములకు 90శాతం మంది రైతులు ఎటువంటి అభ్యంతరం తెలపడం లేదు. అయితే నష్ట పరిహారం పెంచి ఇవ్వాలన్న డిమాండు వారి నుంచి బలంగా విన్పిస్తోంది. ఎయిర్‌పోర్టు కోసం సేకరిస్తున్న భూముల్లో రామకుప్పం, శాంతిపురం మండలాలకు చెందిన కొందరు వైసీపీ నేతల భూములు కూడా ఉండడంతో వారు పలువురు రైతులను రెచ్చగొడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బుధవారం రైతుల వెంట వారు కూడా వచ్చారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దండికుప్పంలో నెలకొన్న పరిస్థితులపై సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కడా పీడీ వికాస్‌మర్మత్‌ కూడా అక్కడకు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్‌పోర్టుకు భూములిచ్చే రైతులకు అన్యాయం జరగదని వారు భరోసా ఇచ్చారు. గతంలో ఇచ్చిన దానికన్నా అధికంగా నష్టపరిహారం అందించడమే కాకుండా, భూములిచ్చే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని వారు రైతులకు హామీ ఇచ్చారు. అంతలో అక్కడకు శాంతిపురం మండల టీడీపీ నేతలు విశ్వనాథ నాయుడు, విజయరామిరెడ్డి, ఉదయ్‌కుమార్‌ తదితరులు చేరుకున్నారు. భూసర్వేకి రైతులు అభ్యంతరం చెప్పేలా ప్రోత్సహిస్తున్నారంటూ వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటయితే కుప్పం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడమే కాకుండా సుమారు 40నుంచి 50వేల మందికి ఉపాఽది దొరుకుతుందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని వైసీపీ నేతలకు సూచించారు. భూసేకరణ విషయంలో రైతులు సహకరించాలని ఎమ్మెల్సీ కంచర్లశ్రీకాంత్‌, కడ సీడీ వికాస్‌మర్మత్‌ కోరారు. కొందరు రైతులు వారిచ్చిన భరోసాతో సానుకూలంగా స్పందించగా, మరికొందరు విముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామంటూ వారు అక్కడి నుంచి వెళ్ళారు.

Updated Date - May 08 , 2025 | 01:43 AM