Share News

అంకురార్పణకు అంతా సిద్ధం

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:00 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిఘట్టమైన అంకుర్పాణకు సర్వం సిద్ధమైంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలంటూ ఆకాంక్షిస్తూ మంగళవారం నిర్వహించనున్నారు.

అంకురార్పణకు అంతా సిద్ధం

తిరుమల, సెప్టెంబరు22(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిఘట్టమైన అంకుర్పాణకు సర్వం సిద్ధమైంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలంటూ ఆకాంక్షిస్తూ మంగళవారం నిర్వహించనున్నారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య నిర్వహించే అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో తొలివాహనంగా ఊరేగిస్తారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విష్వక్సేనులవారు ఈవిధంగా మాడవీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం. మరోవైపు రుత్విక్‌వరణం కూడా విశేషంగా నిర్వహిస్తారు. అర్చకులకు శ్రీవారే విధులు కేటాయిస్తున్నట్టుగా భావించి ఈ తొమ్మిదిరోజుల పాటు ఎవరు ఏ విధులు నిర్వహించాలో ఈ కార్యక్రమం ద్వారా నిర్ణయిస్తారు. దీనికి సంబంఽధించి సోమవారం సాయంత్రానికే ప్రణాళిక సిద్ధం చేశారు.

ముస్తాబైన కొండ

బ్రహ్మోత్సవ వైభవం మంగళవారం నుంచి మొదలుకానున్న నేపథ్యంలో తిరుమల క్షేతాన్ని విద్యుత్‌ అలంకరణలతో ముస్తాబు చేశారు. శ్రీవారి ఆనందనిలయం నుంచి మహద్వారం వరకు, గోపురం, ప్రాకారం, ఆలయ పరిసర భవనాలు, ముఖ్య కూడళ్లు, రహదారులు, పార్కుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణను సోమవారం రాత్రి మరోసారి పరీక్షించి లోటుపాట్లను సరిచేశారు. దీంతో స్వామి క్షేత్రంలో సోమవారం నుంచే బ్రహ్మోత్సవశోభ కనిపించడం మొదలైంది.

మొదలైన సందడి

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉన్నప్పటికీ బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు, డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు, శ్రీవారిసేవకులతో తిరుమల అంతా సందడిగా కనిపించింది. బుధవారం సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అధికారులు, పోలీసులు, ప్రత్యేక దళాలు, బాంబ్‌, గాడ్‌ స్వ్కాడ్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. సోమవారం రాత్రి చిరుజల్లులు పడటంతో ఉత్సవాలకు స్వామే క్షేత్రాన్ని శుభ్రపరుస్తున్నారని కొందరు భక్తులు వ్యాఖ్యానించారు.

Updated Date - Sep 23 , 2025 | 01:00 AM