Share News

పనిచేసే వారిని ప్రోత్సహిస్తా

ABN , Publish Date - May 08 , 2025 | 01:44 AM

జూనియర్లనూ గౌరవిస్తా కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోం సత్యవేడు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌

పనిచేసే వారిని ప్రోత్సహిస్తా
సత్యవేడు సభలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు

సత్యవేడు, మే 7 (ఆంధ్రజ్యోతి): ‘యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. సీనియర్లతో సమానంగా జూనియర్లనూ గౌరవిస్తా’ అని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. సత్యవేడులో బుధవారం రాత్రి ఆయన నియోజకవర్గ టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా ముందుగా కార్యకర్తలనే కలస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఈ సమావేశానికి వచ్చానన్నారు. నాయకుల చుట్టూ కాదు.. ప్రజల చుట్టూ తిరగాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీలో క్యాడర్‌కు అలకలు అనే జబ్బు ఉందన్నారు. పార్టీలో సమస్యలుంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొన్నిసార్లు సమయం పడుతుందన్నారు. అయితే కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోమని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలను అందరం గౌరవించి అమలు చేయాల్సిందేనని లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇక మీదట పార్టీలో పదవులు, ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవులూ కావాలంటే తప్పనిసరిగా కుటుంబ సాధికార వారధులుగా పనిచేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కమిట్‌మెంట్‌తో పనిచేసే నేతలకే పార్టీ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్పను గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేశామని, స్కూలు టీచర్‌ అనితను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఇప్పుడు హోమ్‌ మంత్రిగా నియమించామని గుర్తు చేశారు. కలిశెట్టి అప్పలనాయుడు సామాన్య కార్యకర్త నుంచీ, కాల్వ శ్రీనివాసులు సాధారణ జర్నలిస్టు నుంచీ వచ్చిన వారేనన్నారు. అదే టీడీపీ గొప్పతనమని పేర్కొన్నారు. అందుకే ఉత్తమ కార్యకర్తలను గుర్తించి అవార్డులు ఇస్తున్నామన్నారు. కమిటీలను పకడ్బందీగా నియమించుకుని ముందుకు వెళదామన్నారు. తమ క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌లపై మాత్రమే కార్యకర్తలు దృష్టి పెట్టాలని, ఇతరులను పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. ఈ నెల 14న జరిగే పొలిట్‌ బ్యూరో సమావేశంలో కార్యకర్తల సమస్యలను చర్చిస్తామన్నారు.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే

పార్టీ అధ్యక్షుడి నుంచి కుటుంబ సాధికార సారథి వరకూ అందరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందేనని మంత్రి లోకేశ్‌ స్పష్టంచేశారు. ఏడాది కాలంగా పార్టీ పెద్దగా కార్యక్రమాలు ఇవ్వలేదని, మహానాడు తర్వాత ఎవరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. అహంభావాన్ని ప్రజలు తిరస్కరిస్తారంటూ.. వైసీపీ 151 నుంచీ 11 స్థానాలకు పడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైసీపీ నాయకుల తీరు ఇప్పటికీ మారలేదని, గతంలో లాగానే మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకుపోవాలని, దొంగ పేపరు, టీవీల తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీడాప్‌ ఛైర్మన్‌ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హేమలత, నియోజకవర్గ పరిశీలకులు చంద్రశేఖర్‌నాయుడు, శ్రీపతి బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 01:44 AM