ఏనుగుల హల్చల్
ABN , Publish Date - May 02 , 2025 | 01:29 AM
బంగారుపాళ్యం మండలం టేకుమంద బీట్లోని దేవరకొండ, గౌనివానిచెరువు ప్రాంతాల్లో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. మండలంలో సుమారు 14 ఏనుగులు ఉన్నట్లు సమాచారం.
బంగారుపాళ్యం, మే 1 (ఆంధ్రజ్యోతి): బంగారుపాళ్యం మండలం టేకుమంద బీట్లోని దేవరకొండ, గౌనివానిచెరువు ప్రాంతాల్లో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. మండలంలో సుమారు 14 ఏనుగులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 10 పెద్దఏనుగులు, 4 పిల్లల ఏనుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ప్రస్తుతం గుంపు నుంచి విడిపోయి అటవీప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. వీటిలో కొన్ని నీటి సౌకర్యం ఉండటంతో దేవరకొండ, గౌనివానిచెరువు ప్రాంతాల్లో తిష్ఠ వేశాయి. గురువారం మధ్యాహ్నం కూడా ఎండవేడిమి తట్టుకోలేక గౌనివానిచెరువులోకి వచ్చి సేదతీరుతూ కనిపించాయి.
పంటలపై దాడి చేయకుండా చర్యలు
ఏనుగులు పంటలపై దాడి చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎఫ్ఎ్సవో రమేష్ తెలిపారు. రాత్రిపూట తమ సిబ్బంది, ట్రాకర్ల సాయంతో బాణసంచా కాలుస్తూ.. పెద్ద శబ్దాలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే డ్రోన్ సాయంతో వాటి కదలికలపై నిఘా పెడతామన్నారు. రైతులు, దేవరకొండకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.