జిల్లాకో మోడల్ ఎస్పీఎం కేంద్రం
ABN , Publish Date - Jul 15 , 2025 | 02:12 AM
జిల్లాలో మోడల్ స్పెషల్ మెయింటనెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ (ఎస్పీఎం) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సదరన్ డిస్కం సీఎండీ సంతోషరావు తెలిపారు.
- రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరులో ఏర్పాటు
- ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు కొత్త టెక్నాలజీ
- సదరన్ డిస్కం సీఎండీ సంతోషరావు
చిత్తూరు రూరల్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మోడల్ స్పెషల్ మెయింటనెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ (ఎస్పీఎం) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సదరన్ డిస్కం సీఎండీ సంతోషరావు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం ఈ కేంద్రాన్ని ఆయన పరిశీలించి, ప్రసంగించారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చామని, మెరుగ్గా పనిచేస్తోందని చెప్పారు. ఆయిల్ రీజనరేషన్ మిషన్ అనే కొత్త టెక్నాలజీతో రెండు గంటల్లోనే వెయ్యి లీటర్ల ఆయిల్ను నాణ్యతతో ఫిల్టర్ చేస్తున్నామన్నారు. దీనిద్వారా ట్రాన్స్ఫార్మర్ల మన్నిక కాలం పెరుగుతుందని తెలిపారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. చిత్తూరు మోడల్ ఎస్పీఎం కేంద్రంలో రూ.40లక్షలతో పైలట్ ప్రాజెక్టుగా ఈ టెక్నాలజీ తీసుకొచ్చామని.. సత్ఫలితాలు ఇస్తోందని వెల్లడించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ఏఈలు పని చేసే చోట్ల నివాసం ఉండడం లేదన్నారు. దీనివల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయంలో అందుబాటులోకి రావడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై అలా కుదరదని ఏఈలు ఆయా కేంద్రాల్లో తప్పనిసరిగా నివాసం ఉండాలని.. లేకుంటే చర్యలు తీసుకోవాలని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ని ఆదేశించారు. అనంతరం స్టోర్స్ని పరిశీలించారు. స్టోర్స్లో వాహనాల రాకపోకలకు రోడ్డు వేయాలని సూచించారు. విద్యుత్ శాఖ డైరెక్టర్ గురవయ్య, సీజీఎం జానకిరామ్, ఈఈ మునిచంద్ర, డీఈలు పాల్గొన్నారు.