Share News

వెళ్లిపోయిన ప్రేమమూర్తి పద్మావతి కళాశాల తొలితరం

ABN , Publish Date - May 10 , 2025 | 12:47 AM

తిరుపతికి చెందిన ఒక తరం సాహిత్యవేత్త వెళ్లిపోయారు. పద్మావతి డిగ్రీ కళాశాల తొలితరం విద్యార్థీ, అధ్యాపకురాలు కూడా అయిన డాక్టర్‌ డీఎం. ప్రేమావతి మరణం ఆమె శిష్యులనూ, సాహత్యకారులను దిగ్ర్భాంతికి గురిచేసింది. బొమ్మసముద్రం మండలం నంగమంగళంలో 1942లో పుట్టిన ప్రేమావతి ఊరుదాటి చదువుకోవడమే ఆ కాలపు విచిత్రం. వీరికి తాతయ్యే కేఎం.రెడ్డి ఇందుకు కారణం. పై స్కూల్‌ ఫైనల్‌ తర్వాత చదువులకు తండ్రి అంగీకరించకపోవడంతో తల్లి నగలు దొంగలించి, ఆ డబ్బులతో రవీంద్రనాధ్‌ఠాగూర్‌ శాంతినికేతన్‌లో చేరారు. ఆ తర్వాత స్వంత ఊరికి తిరిగి వచ్చి బొమ్మసముద్రంలో పాక వేసి 1948లో బడి తెరిచారు. ఊరూరికీ తిరిగి పిల్లల్ని చేర్పించారు. ముఖ్యం గా ఆడపిల్లల చదువుల మీద ఆయన పెట్టిన శ్రద్ధతో ఆరేళ్ల ప్రేమావతి కూడా 1948లో బొమ్మసముద్రం బడిలో చేరారు. స్కూల్‌ ఫైనల్‌ తప్పితే పెళ్లి చేసేస్తామని ఇంట్లో బెదిరించడంతో ఆమె చదువే జీవితంగా గడిపారు. 1952లో తిరుపతిలో ప్రారంభమైన పద్మావతి కళాశాలలో 1958లో పదహారేళ్ల ప్రేమావతి పీయూసీ విద్యార్ధిగా చేరారు. ఆ తొలి మెట్టే ఆమె అంతిమ లక్ష్యంగా మారింది.

వెళ్లిపోయిన ప్రేమమూర్తి   పద్మావతి కళాశాల తొలితరం
అధ్యాపకురాలు ప్రేమావతి

- అధ్యాపకురాలు ప్రేమావతి మృతితో శోక సంద్రంలో స్నేహాభిమానులు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 9 (ఆంధ్రజ్యోతి): తిరుపతికి చెందిన ఒక తరం సాహిత్యవేత్త వెళ్లిపోయారు. పద్మావతి డిగ్రీ కళాశాల తొలితరం విద్యార్థీ, అధ్యాపకురాలు కూడా అయిన డాక్టర్‌ డీఎం. ప్రేమావతి మరణం ఆమె శిష్యులనూ, సాహత్యకారులను దిగ్ర్భాంతికి గురిచేసింది. బొమ్మసముద్రం మండలం నంగమంగళంలో 1942లో పుట్టిన ప్రేమావతి ఊరుదాటి చదువుకోవడమే ఆ కాలపు విచిత్రం. వీరికి తాతయ్యే కేఎం.రెడ్డి ఇందుకు కారణం. పై స్కూల్‌ ఫైనల్‌ తర్వాత చదువులకు తండ్రి అంగీకరించకపోవడంతో తల్లి నగలు దొంగలించి, ఆ డబ్బులతో రవీంద్రనాధ్‌ఠాగూర్‌ శాంతినికేతన్‌లో చేరారు. ఆ తర్వాత స్వంత ఊరికి తిరిగి వచ్చి బొమ్మసముద్రంలో పాక వేసి 1948లో బడి తెరిచారు. ఊరూరికీ తిరిగి పిల్లల్ని చేర్పించారు. ముఖ్యం గా ఆడపిల్లల చదువుల మీద ఆయన పెట్టిన శ్రద్ధతో ఆరేళ్ల ప్రేమావతి కూడా 1948లో బొమ్మసముద్రం బడిలో చేరారు. స్కూల్‌ ఫైనల్‌ తప్పితే పెళ్లి చేసేస్తామని ఇంట్లో బెదిరించడంతో ఆమె చదువే జీవితంగా గడిపారు. 1952లో తిరుపతిలో ప్రారంభమైన పద్మావతి కళాశాలలో 1958లో పదహారేళ్ల ప్రేమావతి పీయూసీ విద్యార్ధిగా చేరారు. ఆ తొలి మెట్టే ఆమె అంతిమ లక్ష్యంగా మారింది. పద్మావతి కళాశాల రూపశిల్పి రాజేశ్వరీ మూర్తికి ప్రియశిష్యురాలిగా మారారు. డిగ్రీ పూర్తి అయ్యాక ఆచార్య జీఎన్‌ రెడ్డి ప్రోత్సాహంతో ఎస్వీయూలో పీజీ చేశారు. ఆయన పర్యవేక్షణలోనే దాశరధి రంగాచార్య నవలల మీద పీహెచ్‌డీ చేశారు. రాజేశ్వరీ మూర్తి పట్టుదల వల్ల 1965లో తనకు విద్యాభిక్ష పెట్టిన పద్మావతి కళాశాలలోనే అధ్యాపకురాలిగా చేరారు. వందలాది మంది విద్యార్ధులను ప్రభావితం చేశారు. ఆడవాళ్లకు చదువు అవసరం గురించి పదేపదే చెప్పేవారు. స్వతంత్రంగా జీవించమని అనేవారు. ఆమె శిష్యులు పలువురు వివిధ హోదాల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నారు.

ప్రేమకు ప్రతిరూపం

ప్రేమావతి మరణంతో ఆమె స్నేహమాధుర్యాన్ని చవిచూసినవారంతా శోకతప్తులయ్యారు. ఆమె క్రమశిక్షణాయుతమైన జీవనశైలిని గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడూ నలగని చీర, తలలో మల్లెపూలతోనే ఆమె కనిపించేవారు. ‘మనుషుల పట్ల ఆమె ప్రేమాభిమానాలకు కొలతల్లేవు. ఆత్మవిశ్వాసానికీ, ఆత్మాభిమానానికీ ఆమె నిలువెత్తు సాక్ష్యంగా జీవించారు’ అని ప్రసిద్ధ సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ కృష్ణప్రశాంతి గుర్తు చేసుకున్నారు. ‘ప్రేమకు ప్రతిరూపం ప్రేమావతి. తన మిత్రులు ఎవరు ఆనారోగ్యానికి గురైనా తల్లడిల్లిపోయేవారు. ఆమె లోటు స్నేహాభిమానాలు అందుకున్నవారికి ఎన్నటికీ తీరనిది’ అని ప్రముఖ చిత్రకారిణి కిరణ్‌కుమారి వ్యాఖ్యానించారు. ‘ఆమె ఉత్తమ అధ్యాపకురాలు, భాషా, సాహతీ సేవకురాలు. విద్యారంగానికి మేలుబంతి’ అని సాకం నాగరాజ అన్నారు. ‘ వందలాది మంది విద్యార్ధులను తీర్చిదిద్దిన ప్రేమావతి మరణం పెద్ద లోటు’ అని తిరుపతి జిల్లా రచయితల సంఘం కార్యదర్శి మన్నవ గంగాధరప్రసాద్‌ అన్నారు. గార్లపాటి దామోదర నాయుడు, పేరూరు బాలసుబ్రహ్మణ్యం, రాఘవ, మల్లారపు నాగార్జున, ఓ.వెంకటరమణ, కష్ణవేణి,శైలకుమార్‌, తోట వెంకటేశ్వర్లు, యువశ్రీ మురళి వంటి ఎందరో సంతాపం తెలిపారు. పద్మావతి కాలేజీలో సంతాప సభ నిర్వహించారు. పద్మావతి కాలేజీకి ప్రేమావతి అందించిన సేవలను పద్మావతి జూనియర్‌, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్ళు భువనేశ్వరీదేవి, నారాయణమ్మ కొనియాడారు.

సాహిత్యవేత్తల సాన్నిహిత్యం : ప్రముఖ సాహిత్యవేత్తలు కెవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వకుళభరణం రామకృష్ణ, లలిత, ఆచంట శారదాదేవి, జానకీరాం, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజాం, పులికంటి కృష్ణారెడ్డి, ఆచార్య పీసీ నరసింహారెడ్డి తదితరులతో సన్నిహితంగా మెలిగారు. తిరుపతిలో జరిగే సాహిత్య సభల్లోనూ, పద్మావతి కాలేజీ సభల్లోనూ ఆమె కనిపించేవారు. తాను చదువుకున్న పద్మావతి కళాశాల అన్నా, ఆ కళాశాలకు రూపం ఇచ్చిన రాజేశ్వరీ మూర్తి అన్నా ప్రేమావతికి ప్రాణం. ఈ ప్రస్తావన లేకుండా ఆమె మాటలు సాగేవి కాదు. రాజేశ్వరీ మూర్తి పుట్టిన రోజులను క్రమం తప్పకుండా జరిపేవారు. ఆమె విద్యారంగానికి చేసిన సేవల గురించి వ్యాసాలు రాసేవారు. 104 ఏళ్ల వయసులో తన గురువు రాజేశ్వరీ మూర్తి అమెరికాలో ఇటీవల కన్నుమూయడంతో ప్రేమావతి బాగా దుఃఖించారు. ఒంటరిగా జీవిస్తూనే కన్నుమూసిన ప్రేమావతి తన ఇంట్లో అద్దెకున్న ఈశ్వరి, ఆమె ఇద్దరు కుమారులనే తన కుటుంబంలా మార్చుకున్నారు. నా కోడలు, నా మనుమలు అని మురిపెంగా చెప్పకునేవారు. ఆమె ఆఖరి శ్వాస దాకా వారు వెన్నంటే ఉన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:47 AM