ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:56 AM
దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే అభిప్రాయాన్ని ప్రముఖ ఆర్ధికవేత్త, విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగానికి ముప్పు
ఓటు తొలగింపుతో రాజకీయ నరమేధం
పౌర చైతన్యవేదిక సదస్సులో పరకాల ప్రభాకర్
తిరుపతి(కల్చరల్), డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే అభిప్రాయాన్ని ప్రముఖ ఆర్ధికవేత్త, విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించారు. తిరుపతి అఫీసర్స్ క్లబ్లో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పౌర చైతన్య వేదిక రాష్ట్ర తొలి సదస్సులో బుధవారం ఆయన మాట్లాడారు. ‘రెండున్నరేళ్లుగా మణిపూర్ అట్టుడికిపోతోంది. చాలా మంది ప్రాణాలు కోల్పోగా మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలు వెలుగుచూశాయి. ఇక దేశ ప్రధాన న్యాయస్థానంలో జడ్జిపై చెప్పు విసిరిన సంఘటన జరిగింది. అయినా దేశంలో స్పందన కరువైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పార్లమెంటులో ఆరు దశాబ్దాల కిందటి వందేమాతరం అంశం మీద మాత్రం పది గంటలు చర్చ జరిగిందని విమర్శించారు. ఎస్ఐఆర్ గురించి మాట్లాడు తూ, ‘ఒకప్పుడు ప్రభుత్వాన్ని ఓటరు ఎన్నుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఓటరుగా ఎవరుండాలో ఎన్నుకుంటోంది’ అన్నారు. తమ అనుకూలతల కోసం ఓటును తొలగించడం రక్తపాతంలేని రాజకీయ నరమేధంగా అభివర్ణించారు. ఇలా మాట్లాడే అవకాశం ఎప్పటికీ ఇలానే ఉంటుందన్న నమ్మకం కనిపించడం లేదన్నారు. ఏ క్షణమైనా లోపలకు వెళ్లిపోవచ్చు.. ఈ సభలకు వచ్చివారిలో కొంత మందికి కూడా ఆ పరిస్థితి రావచ్చేమోననే సందేహాన్ని పరకాల ప్రభాకర్ వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులపై పౌరులంతా కార్యరంగంలోకి రావాలి, లేకపోతే మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డమోక్రటిక్ రైట్స్ అండ్ సెక్యులరిజం(సీపీడీఆర్ఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి కుంచె శ్రీధర్ మాట్లాడుతూ చొరబాబుదారులను ఏరివేయడానికి స్పెషల్ ఇంటెన్సిప్ రివిజన్(ఎ్సఐఆర్) ఏర్పాటు చేశామని చెబుతున్న ఎలక్షన్ కమిషన్కు ఎవరు పౌరులో, ఎవరు కాదో తేల్చే బాధ్యత ఎవరిచ్చారని ప్రశ్నించారు. తప్పులపైన తప్పులు చేస్తూ ఎలక్షన్ కమిషన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. పౌర చైతన్య వేదిక విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్ కోలవెను చాంద్ ఎస్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఓంకార్ వివాదాస్పద కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ, తిరుపతి జిల్లా కార్యదర్శి ఏఎన్.పరమేశ్వరరావు పెగాసెస్ వైర్సను పోలిన సంచార సాధియా్పను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాలను సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో పౌర చైతన్య వేదిక సభ్యులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు.