కుప్పంలో పరిశ్రమలకు నేడు సీఎం శంకుస్థాపన
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:41 AM
కుప్పంలో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు.
కుప్పం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.2203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమలు కుప్పానికి రానున్నాయి. ఆదిత్య బిర్లా రూ.586 కోట్లు , ఏస్ ఇంటర్నేషనల్ రూ.525 కోట్లు, ఎస్వీఎఫ్ సోయా రూ.72 కోట్లు, మదర్ డెయిరీ రూ.260 కోట్లు, శ్రీజ రూ.233 కోట్లు, ఈ రాయిస్ రూ.200 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను కుప్పంలో స్థాపించడానికి ముందుకొచ్చాయి. ఈ పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభిస్తారు. ఆయా పరిశ్రమల ద్వారా నియోజకవర్గంలో ఏకంగా 22 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. కుప్పం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు కూడలి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేశ్బాబు, కడా పీడీ వికాస్ మర్మత్ కలిసి వీక్షించనున్నారు. అలాగే నియోజకవర్గంలోని నాలుగు మండల కేంద్రాలు, పంచాయతీ కేంద్రాలలో ఎల్ఈడీ స్ర్కీన్ల ద్వారా ప్రజలు వీక్షించే ఏర్పాట్లను అధికారులు చేపట్టారు.