Share News

వేడుకగా అమ్మవారి ఆలయ శుద్ధి

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:46 AM

పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 5 నుంచి పవిత్రోత్సవాలు

వేడుకగా అమ్మవారి ఆలయ శుద్ధి
ధ్వజస్తంభాన్ని శుద్ధి చేస్తున్న డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్‌ తదితరులు

తిరుచానూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 5 నుంచి పవిత్రోత్సవాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించారు. ఆలయ గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని నీటితో శుద్ధి చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ నెల 4న అంకురార్పణ.. 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో ఉదయం బ్రేక్‌ దర్శనం, ఆర్జితసేవలు రద్దు చేశారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఓ దాత పరదాలను కానుకగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్‌, సూపరింటెండెంట్‌ రమేష్‌, ఆర్చకులు బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, చలపతి, సుబ్బరాయుడు, సుభాస్కర్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:46 AM