సైకో దాడిలో భిక్షగాడి మృతి
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:25 AM
ఆధ్యాత్మిక క్షేత్రంలో కలకలం రేగింది.
తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి: వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు. జనం గుమికూడిన చోటికి వచ్చి బూతులతో తిడుతుంటారు. కుక్క లేదా ఏదైనా జంతువు కనిపిస్తే రోడ్డుపైకి రాళ్లు విసురుతారు. ఆ రాయి ఎక్కడ తగులుతుందోనని జనం, వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంటుంది. పిచ్చోళ్లలా ఉంటూ చేతిలో పెద్ద కర్రతో తిరిగే వారిని చూసి భయపడుతుంటారు. ఇలాంటి వారు తిరుపతి నగరంలో ఎక్కువవుతున్నారు. సోమవారం నాటి ఘటనతో ఆధ్యాత్మిక క్షేత్రంలో కలకలం రేగింది.
కుటుంబంలో అనాదరణకు గురైన వారు. పక్కరాష్ట్రాలు, జిల్లాల్లోని కొందరు యాచకులు. మతిస్థిమితం లేనివారు. వీరందరికీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి కేరా్ఫగా మారుతోంది. ఇలా వచ్చిన వారిలో కొందరి విపరీత పోకడలు స్థానికులు, భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మాసిన ముఖం...పెరిగిన గడ్డం...చిరిగిన దుస్తులు ధరించి వీరు ఇటీవల తుడా సర్కిల్, లీలామహల్ రోడ్డు, మంగళం రోడ్డు, తిలక్ రోడ్డు, నంది సర్కిల్, అన్నారావు సర్కిల్, కపిలతీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, బస్టాండు, రైల్వే స్టేషన్ రోడ్డు, బాలాజీ కాలనీ, అలిపిరి రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నారు. ఎవరైనా వీరిలో కొందరి జోలికి వెళ్ళినా, వారిని పలకరించినా వెంటనే కర్రలు, కత్తులతో దాడులకు దిగుతున్నారు. కొన్ని సర్కిళ్లలో వాహనదారులకు అడ్డండపడి భిక్షాటన చేస్తూ ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. ఇక, ఓ మహిళ భిక్షాటన సమయంలో ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే వారిని నానా బూతులతో తిడుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తిరుపతిలో 60 నుంచి 70 మంది వరకు భిక్షగాళ్ళు, మతిస్థిమితం కోల్పోయిన వారు ఉన్నట్లు సమాచారం. ఈ మతిస్థిమితం కోల్పోయిన వారే ప్రవర్తనే కొన్ని సమయాల్లో సైకోల్లా ఉంటుంది. ఇలాంటి వారి ప్రవర్తనపై నిఘా ఉంచి.. వీరిని మానసిక వికలాంగుల ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించాల్సిన పోలీసులు, మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ ఘటనలు
15 రోజుల క్రితం తుడా సర్కిల్ వద్ద ఉదయం సమయంలో దినసరి కూలీగా పనిచేస్తున్న రామస్వామిపై ఓ యాచకుడు దాడి చేశాడు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడ్డారు.
లీలామహల్ సర్కిల్ వద్ద ఫుట్పాత్పై భోజనం చేస్తున్న ఇద్దరు మహిళల వద్దకు వెళ్లిన ఒక మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి అన్నం పెట్టాలని అడిగాడు. వారు లేదని చెప్పడంతో తన చేతిలో ఉన్న కర్రతో కొట్టాడు. దీంతో ఒక మహిళ గాయపడింది.
మూడు నెలల క్రితం లీలామహల్ నుంచి శివజ్యోతినగర్ వైపు నడచి వెళుతున్న ఒక యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో ఇద్దరు యువకులు అడ్డం పడ్డారు.
తాజా ఘటనతో కలవరం
చాలామందిలాగే తమిళనాడు నుంచి తిరుపతికి చేరిన ఓ మతి స్థిమితంలేని వ్యక్తి.. సోమవారం ఉదయం 7.15 గంటల ప్రాంతంలో నంది సర్కిల్ వద్ద వీరంగం చేశాడు. భిక్షగాడు శేఖర్తో గొడవకు దిగి తన చేతిలో ఉన్న కర్ర, కత్తితో తలపై మోదాడు. అడ్డొచ్చిన భిక్షగత్తె కల్పనను.. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న తారకరామానగర్కు చెందిన సుబ్రమ్మణ్యంపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్ మృతిచెందగా, మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికులు, భక్తులను కలవరపాటుకు గురిచేసింది.
వలేసి సైకోను పట్టుకుని..
సమాచారం తెలిసిన వెంటనే అలిపిరి పోలీసులు అప్రమత్తమయ్యారు. భిక్షగాడిని హతమార్చిన సైకోను పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి సమక్షంలో సిబ్బంది, అలిపిరి ఎస్ఐ లోకే్షబాబు, స్థానికులతో కలిసి వలవేసి పట్టుకున్నారు. అలిపిరి పోలీసు స్టేషన్కు తరలించారు. అతడి బ్యాగులో కత్తులు, కర్రలను సీజ్ చేశారు. నిందితుడిపై లునటిక్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం రుయాకు తీసుకెళ్ళి కోర్టు ఎదుట హాజరుపరచి న్యాయమూర్తి ఆదేశాలతో వైజాగ్లోని పిచ్చాసుపత్రికి తరలిస్తామని అలిపిరి సీఐ రాంకిషోర్ ఆంధ్రజ్యోతికి చెప్పారు.