యూపీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:21 AM
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సాధికారిత, సంక్షేమ అధికారి రబ్బాని బాష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు అర్బన్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సాధికారిత, సంక్షేమ అధికారి రబ్బాని బాష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 25వ తేదీలోపు జిల్లా వెనుకబడిన సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తులను ఇవ్వాలన్నారు. డిసెంబరు 5న స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ఆధారంగా విజయవాడలో శిక్షణ ఇస్తారన్నారు. ఇందులో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్నారు. ఎంపికైన వారికి ఎన్టీయార్ జిల్లాలోని గొల్లపూడిలో ఉన్న బీసీ భవన్ లో శిక్షణ ఉంటుందన్నారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్టులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, రెండు పాస్పోర్టుసైజు ఫొటోలు అతికించి నేరుగా దరఖాస్తులను కలెక్టరేట్లోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో ఇవ్వాలన్నారు. ఇతర వివరాలకు 9177429494 నెంబరును సంప్రదించాలన్నారు.