వికసిత భారత్లో ‘ఏఐ-ఎంఎల్’ కీలక భూమిక
ABN , Publish Date - Dec 28 , 2025 | 02:18 AM
అన్నిరంగాలలో కృత్రిమమేథ చొరబడి కొత్తపుంతలు తొక్కుతోంది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రవాణా, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో కీలక భూమిక పోషిస్తోంది. అధునాతన సాంకేతికతని ఎంత అందిపుచ్చుకున్నా మనిషి మేధస్సు (బ్రెయిన్)ను వాడుతూ అవసరమైన చోట ఏఐ టూల్స్ వినియోగించినప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయంటున్నారు ఆ రంగానికి చెందిన నిపుణులు. తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో రెండో రోజైన శనివారం వివిధ రంగాల నిపుణులు మన భారతీయ విజ్ఞాన వైభవాన్ని వివరించారు. ఇక, వికసిత భారత్కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్(ఏఐ-ఎంఎల్) అప్లికేషన్స్పై చర్చ జరిగింది. తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ కాళిదాసు కోఆర్డినేటర్గా, ప్యానలిస్టులుగా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లు ఎం.విద్యాసాగర్, డాక్టర్ మోహన్రాఘవన్ నేరుగా హాజరవగా, పర్డ్యూ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలోక్ ఆర్.చతుర్వేది, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ ఆర్నబ్ భట్టాచార్య వర్చువల్గా పాల్గొన్నారు. కృత్రిమమేథ మనిషి మేథస్సును అనుకరించేలా పనిచేసే కంప్యూటర్ వ్యవస్థ అని.. డేటా, అల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్పై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సరైన డేటా, నైతిక ప్రమాణాలు తప్పనిసరి అవసరమన్నారు. సబ్జెక్టుల పరంగా ఎంతపరిజ్ఞానాన్ని సాధించారనే దానికి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ద్వారా గతంలో తెలియగా, ఇప్పుడు అకడమిక్స్లో నేరుగా ఏఐ మూల్యాంకనాన్ని చేస్తున్నట్లు వివరించారు. చాట్ జీపీటీని రీసెర్చ్ పేపర్స్, లీడ్ జర్నల్స్లోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఏఐ ఫెయిలైతే పరిస్థితి ఏంటన్న పలువురి సందేహాలను వారు నివృత్తి చేశారు. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ నైతిక సమస్యలు పెరుగుతున్నాయని, బయాస్, ప్రైవసీ, సెక్యూరిటీ, ఉద్యోగాల ప్రభావం వంటివి ఉన్నాయంటున్నారు.
విద్యార్థులు సరికొత్త ఆలోచనలు చేయాలి
- భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో చర్చ
రెండో తరలివచ్చిన సందర్శకులు
తిరుపతి (రూరల్/విశ్వవిద్యాలయాలు), డిసెంబరు27 (ఆంధ్రజ్యోతి):
ఆలోచనలు రేకెత్తించిన సైన్స్ మ్యాజిక్ షో
ముంబైకి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) ఇంజినీర్, మెజీషియన్ డాక్టర్ జయంత్ వసంత్ జోషి సభావేదికపై వాటర్ బేస్డ్, ఫిజిక్స్కి సంబంధించిన పలు సైన్స్ మ్యాజిక్స్ని ప్రదర్శించారు. విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించారు. పలు ప్రిన్సిపల్స్ ఆధారంగా నీరుతో రసాయన చర్యలు జరిపించి మ్యాజిక్ ప్రదర్శించారు. ఓగ్లాసులో నీరు, పాలు నిండుగా తీసుకుని ఆటోమేటిగ్గా తగ్గించడం, ఒకకప్పులో నీరు తీసుకుని ల్యాంప్ వెలిగించడం వంటి మ్యాజిక్స్ ప్రదర్శించారు. ఇవెలా సాధ్యమంటే.. చెంబులో కింద అంచుకు చిన్న రంధ్రాన్ని బొటన వేలు కప్పి ఉంచుతారు. దీన్ని గమనించే అవకాశం ఉండదు. దీంతో పీడన వ్యత్యాసంతో చెంబులో నీరు తగ్గినట్టు కనిపిస్తోంది. నీరులో ఎసిటిలీన్ గ్యాస్ స్టికర్ని వేసి దీపాన్ని వెలిగిస్తారు.
1463
త్వరలో ఆయుష్ వైద్యుల నియామకం
భారతీయ సంప్రదాయ వైద్య వారసత్వానికి ప్రామాణికత చేకూర్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘సంప్రదాయ వైద్య పద్ధతులు.. పరిశోధన’ అంశంపై ఆయన మాట్లాడారు. ఆయుష్ వైద్యుల నియామకాలను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఔషధ మొక్కల పెంపకం, సంరక్షణపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సంప్రదాయ వైద్యులు తెచ్చిన ఔషధ మొక్కల్ని, మూలికల్ని మంత్రి ఆసక్తితో పరిశీలించి వాటి వివరాలను తెలుసుకున్నారు. సంప్రదాయ వైద్య పద్ధతుల్ని గ్రంథస్థం చేసి వాటికి ప్రామాణికత చేకూరేలా పని చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞాన భారతి అఖిల భారత సంఘటన ప్రతినిధి డాక్టర్ శివకుమార్ శర్మ అభిప్రాయపడ్డారు.
మెరుగుపడుతున్న మన దేశ ఆర్థిక పరిస్థితి
ఈ సమ్మేళనంలో పీఎం ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ శామిక రవి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక ప్రగతిని ప్రామాణికమైన గణాంకాలతో వివరించారు. ప్రజలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని పేదరికం నుండి బయటపడుతున్నారనీ, ప్రసవ మరణాలు, శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. దిగుమతులు, ఎగుమతులు, నిరుద్యోగం, సంపద పంచడం వంటి పలు ఆర్థిక, సామాజిక అంశాలపై వివరించారు.
ఓపెన్ సైన్స్ పబ్లిషింగ్పై డిబేట్
ఓపెన్ సైన్స్ ఎకో సిస్టమ్ ఫర్ భారతీయ జర్నల్ పబ్లిషింగ్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయ పరిశోధన పత్రాల ప్రచురణ, ప్రామాణికత గురించి అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు మాట్లాడారు.