లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:07 AM
ప్రయా ణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్ధం. లేచి చూసేసరికి క్లీనర్ మృతి చెంది ఉండగా, మరో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం కారుతున్న కొందరు ప్రయాణికులు ఒకరినొకరు చూసుకొని కేకలు వేశారు.
క్లీనర్ మృతి, మరో డ్రైవర్కు తీవ్ర గాయాలు
10 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు
నాయుడుపేట టౌన్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రయా ణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్ధం. లేచి చూసేసరికి క్లీనర్ మృతి చెంది ఉండగా, మరో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం కారుతున్న కొందరు ప్రయాణికులు ఒకరినొకరు చూసుకొని కేకలు వేశారు. ఈ ఘటన నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం అర్ధరాత్రి ఒంగోలు నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు నాయుడుపేట - చెన్నై జాతీయ రహదారి సమీపంలోకి రాగానే బొగ్గు లోడుతో ముందు వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ ఖాదర్(45) క్యాబిన్లో ఇరుక్కొని అక్కడిక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ సురే్షరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు నడుపుతున్న గౌస్బాషా, 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే మొబైల్, 108సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని బస్సులో ఇరుక్కుపోయిన ఖాదర్ మృతదేహాన్ని అతి కష్టంమీద బయటకు తీసి నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలు రోడ్డుపైనే ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు క్రేన్ సహాయంతో రెండు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.