కోడిబొచ్చు కథలో కొత్త ట్విస్ట్
ABN , Publish Date - May 31 , 2025 | 01:52 AM
తిరుపతి కోడిబొచ్చు కథలో మరో ట్విస్ట్ బయటపడింది. ఎన్నికల ముందు వైసీపీ చేస్తున్న చికెన్ వేస్ట్ మాఫియా బాగోతాన్ని ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభలో ప్రస్తావించడంతో కోడిబొచ్చు వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.
- టెండరు పిలిచిన కార్పొరేషన్
- టన్ను రూ.వందకే కొట్టేసేందుకు బిడ్డర్ యత్నం
- పైరవీలతో టెండర్ దాఖలు
తిరుపతి- ఆంధ్రజ్యోతి
తిరుపతి కోడిబొచ్చు కథలో మరో ట్విస్ట్ బయటపడింది. ఎన్నికల ముందు వైసీపీ చేస్తున్న చికెన్ వేస్ట్ మాఫియా బాగోతాన్ని ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభలో ప్రస్తావించడంతో కోడిబొచ్చు వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ దృష్టిలో పడేలా ఆ పార్టీ అనుచరులకు సమాచారమిచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి చికెన్ వేస్ట్ను తన గుప్పెట్లోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. నాలుగు నెలల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందించి చికెన్ వేస్ట్కు పుల్స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ అధికారులు కూడా చికెన్ వేస్ట్ను మీట్మీల్గా మార్చే ప్రక్రియకోసం అన్వేషించారు.
ఫ ఆంధ్రజ్యోతి సూచనతో టెండర్ ఆహ్వానం
కోడిబొచ్చు వ్యవహారంపై వస్తున్న విమర్శలు తిరుపతి నగరపాలక సంస్థకు తలనొప్పిగా మారాయి. చికెన్వేస్ట్ను మీట్మీల్గా మారిస్తే అటు కార్పొరేషన్కు ఆదాయంతో పాటు ఇటు వ్యర్థాలను చేపల చెరువులకు తరలించకుండా వీలవుతుందని ‘ఆంధ్రజ్యోతి’ సవివరాలతో ప్రచురించింది. దీనిపై దృష్టిపెట్టిన మున్సిపల్ కార్పొరేషన్ రెండు వారాల క్రితం చికెన్ వేస్ట్ను రీసైకిల్ చేసేందుకు టెండరు ఆహ్వానించింది. ఇక్కడే మరో ట్విస్ట్ బయటపడింది. మహానగరాల్లో చికెన్ వేస్ట్ టన్ను రూ.500 వరకు ధర ఉంటే కేవలం రూ.100కే టన్ను చికెన్ వేస్ట్ను దక్కించుకునేందుకు ఓ రీసైక్లింగ్ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు రాజకీయ పెద్దల అండదండలతో కార్పొరేషన్ అధికారులతో ఒత్తిడి చేయించి రూ.100కే టన్ను చికెన్ వేస్ట్కోసం కోట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. తిరుపతి నగరంలో రోజుకు 5 టన్నుల చికెన్ వేస్ట్ వస్తుంది. ఆదివారాల్లో 10 టన్నుల వరకు వస్తుంది. అంటే సాధారణ రోజుల్లో రూ.500, ఆదివారాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే కార్పొరేషన్కు ఆదాయం వస్తోంది. పోటీఎవరూ రాకుండా అనుకూలమైన నిబంధనలు కూడా పెట్టుకున్నట్టు సమాచారం. అయితే ఒకే బిడ్డర్ పాల్గొంటే టెండరు రద్దు చేసే ఆలోచనలో కూడా యంత్రాంగం లేకపోలేదు.