అపోలోతో ఒప్పందంపై అర్ధగంట చర్చ
ABN , Publish Date - May 07 , 2025 | 12:57 AM
చిత్తూరు ప్రభుత్వాస్పత్రితో అపోలో సంస్థ కుదుర్చుకున్న ఎంవోయూ మేరకు నిర్వహణ జరుగుతోందో లేదో సమగ్ర అధ్యయనం చేయాలని ఇన్ఛార్జి మంత్రి రామ్ప్రసాద్రెడ్డిని పలువురు సభ్యులు కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగు హాల్లో మంత్రి అధ్యక్షతన సుమారు మూడు గంటల పాటు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం సాగింది. కన్వీనర్గా కలెక్టర్ సుమిత్కుమార్ , సభ్యలుగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ హాజరయ్యారు.జడ్పీ, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భజలశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, హార్టికల్చర్, వైద్య, పరిశ్రమల శాఖలపై చర్చించారు.జేసీ విద్యాధరి, డీఎ్ఫవో భరణి, డీఆర్వో మోహన్కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
- నిర్మాణాత్మకంగా సాగిన డీడీఆర్సీ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్, మే 6 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు ప్రభుత్వాస్పత్రితో అపోలో సంస్థ కుదుర్చుకున్న ఎంవోయూ మేరకు నిర్వహణ జరుగుతోందో లేదో సమగ్ర అధ్యయనం చేయాలని ఇన్ఛార్జి మంత్రి రామ్ప్రసాద్రెడ్డిని పలువురు సభ్యులు కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగు హాల్లో మంత్రి అధ్యక్షతన సుమారు మూడు గంటల పాటు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం సాగింది. కన్వీనర్గా కలెక్టర్ సుమిత్కుమార్ , సభ్యలుగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ హాజరయ్యారు.జడ్పీ, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భజలశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, హార్టికల్చర్, వైద్య, పరిశ్రమల శాఖలపై చర్చించారు.జేసీ విద్యాధరి, డీఎ్ఫవో భరణి, డీఆర్వో మోహన్కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల తెలుగు మహిళా నాయకురాలు శ్రీదుర్గకు సరైన వైద్యం అందించకపోవడంతో ఆమె మృతి చెందారని, ఈ ఘటన తీవ్ర మనోవేదనకు గురి చేసిందని ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పారు. అక్కడ అపోలో తరఫున పనిచేస్తున్న ఒక ఫిజీషియన్ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ సంఘటన జరగిందని ఆరోపించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అపోలో సంస్థ నడుచుకోవడం లేదని నిర్ణీత నిష్పత్తిలో స్పెషలిస్టు వైద్యులు లేరన్నారు. రూ.కోట్లను మందుల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్నా.. రోగులకు మాత్రం ఇక్కడ అవసరమైన మందుల్ని అపోలో అందించడం లేదని ఆరోపించారు. సోమవారం చిత్తూరుకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు కూడా ఈ అంశంపై వాకబు చేశారన్నారు. ఈ విషయంగా సమగ్ర విచారణ నివేదిక కలెక్టర్కు అందించాలని కోరారు. ఈ విషయంగా సభలో సుమారు అరగంట చర్చ కొనసాగింది.
సీఎం దృష్టికి
మామిడి రైతుల సమస్యలు
జిల్లాలోని మామిడి రైతుల సమస్యల గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సభ్యులు తీర్మానించారు. గిట్టుబాటు ధర ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ఈసారి అలా జరగకుండా మంచి ధర అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.యుద్ధాల కారణంగా జిల్లా నుంచి ఎగుమతి కావాల్సిన తోతాపురి గుజ్జు నిల్వలు విపరీతంగా పెరిగిపోయాయని ఎంపీ ప్రసాద రావు వివరించారు.అకాల వర్షాల కారణంగా నేలరాలిన మామిడితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కొంతైనా నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జగన్మోహన్ కోరారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మామిడి విస్తీర్ణాన్ని తగ్గించేటట్లు చూడాలని, మామిడి బోర్డు, మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కేంద్రంతో చర్చించి ఒప్పించాలని ఎంపీని ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు.
తిరుమల భక్తులకు
మామిడి రసాల పంపిణీకి తీర్మానం
ఉద్యానశాఖ గురించి సభలో చర్చ సుదీర్ఘంగా సాగింది. మామిడి గుజ్జును రసాలుగా మార్చి టెట్రా ప్యాకెట్ల రూపంలో తిరుమలలో క్యూ కాంప్లెక్స్, నడకదారిలో వెళ్లే భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేలా టీటీడీ బోర్డును ఒప్పించాలని కోరుతూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు తప్పనిసరి
పలమనేరు మండలం జగమర్ల నుంచి చంద్రగిరి మండలం ఐతేపల్లె వరకు ఉన్న జాతీయ రహదారిపై ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని,మధ్యలో పి.కొత్తకోట వద్ద హైవే ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. ప్రభుత్వం బడ్జెట్లో వైద్యానికి నిధులు అధికంగా కేటాయిస్తున్నా.. అన్ని పీహెచ్సీ, సీహెచ్సీల్లో వైద్యులు డ్యూటీలు సరిగా చేయకపోవడంతో ఓపీల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పుంగనూరుకు రూ.12 కోట్లు..
చిత్తూరుకు రూ.18 లక్షలు!
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గానికి తాగునీటి పనులు, నిధుల కేటాయింపులో పక్షపాతం చూపారని ఎంపీ దగ్గుమళ్ల ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గానికి తాగునీటి పనుల కోసం రూ.12 కోట్ల పనులు మంజూరు చేసి, చిత్తూరుకు రూ.18 లక్షలు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఇకపై ఏకపక్షంగా కాకుండా అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధుల్ని కేటాయించాలన్నారు.
సీఎం దృష్టికి ఎస్పీ గైర్హాజరు
జిల్లాలో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందని, ఈ అంశంపై కూలంకషంగా చర్చించేందుకు డీడీఆర్సీలో అజెండాగా చేర్చమని అధికారులకు సూచించానని ఎంపీ దగ్గుమళ్ల అన్నారు. కానీ, ఇలాంటి కీలక సమావేశానికి ఎస్పీ మణికంఠ గైర్హాజరు కావడం దారుణమని, దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు.