బోల్తా పడ్డ లారీని చూస్తుండగా దూసుకొచ్చిన బస్సు
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:43 AM
రోడ్డుపై బోల్తా పడ్డ లారీని చూస్తున్న వారిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.కార్వేటినగరం మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వెదురుకుప్పం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై బోల్తా పడ్డ లారీని చూస్తున్న వారిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.కార్వేటినగరం మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చెన్నై నుంచి చిత్తూరు వైపు ఓ లారీ ఆయిల్ డబ్బాలతో కార్వేటినగరం మీదుగా వెళుతుండగా ఆర్కేవీబీపేట క్రాస్రోడ్డు ఇందిరా కాలనీ సమీపంలోని ఓ పౌల్ర్టీ ఫాం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ విషయం తెలియడంతో ఇందిరాకాలనీ, ఆర్కేవీబీపేట గ్రామస్తులు కొందరు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తుండగా తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కార్వేటినగరం మీదుగా పళ్లిపట్టుకు వెళ్తూ అక్కడ ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. అలాగే ఇందిరా కాలనీకి చెందిన రామలింగం(64), గిరిబాబుపై దూసుకెళ్లింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం కార్వేటినగరం సీహెచ్సీకి 108 అంబులెన్స్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామలింగం చనిపోయారు. గిరిబాబును మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతికి తరలించారు. మృతుడి కుమారుడు వాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్వేటినగరం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గాయపడిన సమయంలో చికిత్స నిమిత్తం కార్వేటినగరం సీహెచ్సీకి తరలిస్తే అక్కడ డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేరని, వారిపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశామని స్థానికులు తెలిపారు.