Share News

పవన్‌పై దాడి కేసులో 8 మంది అరెస్టు

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:26 AM

తిరుపతిలో పవన్‌కుమార్‌పై దాడి చేసిన కేసులో ఎనిమిది మంది నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండుకు పంపారు. దీంతో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది.

పవన్‌పై దాడి కేసులో 8 మంది అరెస్టు

తిరుపతి (నేరవిభాగం), ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో పవన్‌కుమార్‌పై దాడి చేసిన కేసులో ఎనిమిది మంది నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండుకు పంపారు. దీంతో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం తెలిపిన ప్రకారం.. పవన్‌ను విచక్షణారహితంగా కొడుతున్న దినేష్‌ వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇతడే ఏ1. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం అట్లవారిపల్లెకు చెందిన దినేష్‌ తిరుపతిలోనే ఉంటున్నాడు. అరెస్టయిన వారిలో ఇంకా గంగాధరనెల్లూరు మండలం వేల్కూరుకు చెందిన రేవంత్‌రాజు, ఓజిలికి చెందిన అజయ్‌కుమార్‌, తిరుపతిలోని మంచినీళ్లగుంటకు చెందిన మలిశెట్టి హరికృష్ణ, పులిచెర్ల మండలం బండారువారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, చౌడేపల్లె మండలం పరికిదొనకు చెందిన కిశోర్‌బాబు, సదుం మండలం పాలమందకు చెందిన మధు, సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కడపలవారిపల్లెకు చెందిన సాయికిరణ్‌ ఉన్నారు. ప్రస్తుతం వీరిలో సాయికిరణ్‌ బెంగళూరులో ఉండగా, మిగిలిన వారంతా తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఎనిమిది మంది తిరుపతి రూరల్‌ మండలం రామచంద్రాపురం జంక్షన్‌ సమీపాన అవిలాల మైదానం దక్షిణ గేటు వద్ద ఉండగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మిగిలిన నిందితులనూ త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కాగా, ఈ కేసులో ఏ2, ఏ3 నిందితులైన అనిల్‌కుమార్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిని ఇంతకుముందే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 15 , 2025 | 01:26 AM