చాట్బాట్తో 250 ఫోన్ల స్వాధీనం
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:44 AM
బాధితులు పోగొట్టుకున్న, చోరీలకు గురైన 50 లక్షల విలువైన 250 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ మణికంఠ స్థానిక పోలీసు అతిథి గృహంలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం మీడియాకు తెలిపారు.
చిత్తూరు అర్బన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): బాధితులు పోగొట్టుకున్న, చోరీలకు గురైన 50 లక్షల విలువైన 250 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ మణికంఠ స్థానిక పోలీసు అతిథి గృహంలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం మీడియాకు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయినవారు ఇంట్లో నుంచే చాట్బాట్ ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే చాలు. చాట్బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ ద్వారా రికవరీ చేస్తుంది. మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి కూడా రికవరీ చేశారని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు 11 దశల్లో 7.92కోట్ల విలువైన 3791 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు చెప్పారు. సమావేశంలో క్రైమ్ సీఐ ఉమామహేశ్వరరావు, ఒకటో పట్టణ సీఐ మహేశ్వర, చాట్బాట్ సిబ్బంది బాపూజీ, రఘురామన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాధితులకు ఫోన్లను ఎస్పీ అందజేశారు. టెక్నికల్ టీమ్కు రివార్డులను ప్రదానం చేశారు.
చాట్బాట్కు సమాచారం ఇవ్వాలిలా..
మొబైల్ పోగొట్టుకున్నవారు ముందుగా 94409 00004 వాట్సాప్ నెంబరుకు హాయ్ లేదా హెల్ప్ అని పంపాలి. ఆ వెంటనే వెల్కమ్ టూ చిత్తూరు పోలీసు అనే పేరున ఒక లింకు వస్తుంది. ఆ లింకులో గూగుల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో సూచించిన విధంగా జిల్లా పేరు, వయస్సు, తండ్రి చిరునామా, కాంటాక్టు నెంబరు, మిస్సయిన మొబైల్ మోడల్, ఐఎంఈఐ నెంబరు, పోగొట్టుకున్న ప్రదేశం తదితర వివరాలను పొందుపరిచి, సబ్మిట్ చేస్తే చాలు. పోలీసులు ఆ మొబైల్ను రికవరీ చేసి బాధితులకు అందిస్తారని ఎస్పీ మణికంఠ వివరించారు.