16 మంది బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:50 AM
అస్వస్థతతో 16 మంది హాస్టల్ విద్యార్థులు ఒకేసారి ఆస్పత్రిలో చేరడంతో శ్రీకాళహస్తిలో మంగళవారం కలకలం రేగింది. సంస్కృత పాఠశాల సమీపంలోని బీసీ వసతిగృహంలో 56మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. దీనిని ఫిబ్రవరిలో బీసీ సంక్షేమశాఖ అధికారులు ప్రారంభించారు. నాలుగు రోజుల కిందట నిర్వహించిన బదిలీల్లో ఇక్కడి వార్డెన్ రామయ్యను సత్యవేడుకు బదిలీ చేశారు. ఏర్పేడు బీసీ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర్లుకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారు. పాతవార్డెన్ మంగళవారం నాటికి చార్జ్ అప్పగింత పూర్తికాలేదు. బదిలీల కారణంగా పాత, కొత్త వార్డెన్ల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇన్ఛార్జి వార్డెన్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో 56మంది విద్యార్థులకు మెనూ ప్రకారం ఇడ్లీ, వేరుశనగ పప్పు చట్నీతో అల్పాహారం అందించారు. కాసేపటికి ఒప్పంద ఉద్యోగి వినోద్ హాస్టల్కు వచ్చారు. తమకు వాంతులు అయ్యాయని కొందరు.. కడుపునొప్పితో వాంతులు అయ్యేలా ఉన్నాయని కొందరు పిల్లలు అతడికి చెప్పారు. కాసేపటికే కొందరు విద్యార్థి సంఘ నాయకులకు, మీడియాకు సమాచారం అందింది.

- శ్రీకాళహస్తిలో కలకలం
- పిల్లలను పరామర్శించిన నేతలు, విద్యార్థి, ప్రజాసంఘాలు
శ్రీకాళహస్తి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): అస్వస్థతతో 16 మంది హాస్టల్ విద్యార్థులు ఒకేసారి ఆస్పత్రిలో చేరడంతో శ్రీకాళహస్తిలో మంగళవారం కలకలం రేగింది. సంస్కృత పాఠశాల సమీపంలోని బీసీ వసతిగృహంలో 56మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. దీనిని ఫిబ్రవరిలో బీసీ సంక్షేమశాఖ అధికారులు ప్రారంభించారు. నాలుగు రోజుల కిందట నిర్వహించిన బదిలీల్లో ఇక్కడి వార్డెన్ రామయ్యను సత్యవేడుకు బదిలీ చేశారు. ఏర్పేడు బీసీ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర్లుకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారు. పాతవార్డెన్ మంగళవారం నాటికి చార్జ్ అప్పగింత పూర్తికాలేదు. బదిలీల కారణంగా పాత, కొత్త వార్డెన్ల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇన్ఛార్జి వార్డెన్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో 56మంది విద్యార్థులకు మెనూ ప్రకారం ఇడ్లీ, వేరుశనగ పప్పు చట్నీతో అల్పాహారం అందించారు. కాసేపటికి ఒప్పంద ఉద్యోగి వినోద్ హాస్టల్కు వచ్చారు. తమకు వాంతులు అయ్యాయని కొందరు.. కడుపునొప్పితో వాంతులు అయ్యేలా ఉన్నాయని కొందరు పిల్లలు అతడికి చెప్పారు. కాసేపటికే కొందరు విద్యార్థి సంఘ నాయకులకు, మీడియాకు సమాచారం అందింది. అక్కడే ఉన్న వార్డెన్ 16 మందిపిల్లలను ప్రైవేటు వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి విద్యార్థుల అస్వస్థతపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరల్గా మారింది. ఎమ్మెల్యే సుధీర్ సూచనలతో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, నేతలు ఆస్పత్రికి చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వీడియోకాల్ ద్వారా ఆస్పత్రి సూపరింటెండెంట్ మణితో ఎమ్మెల్యే మాట్లాడి.. పిల్లల యోగక్షేమాలను తెలుసుకున్నారు. హాస్టల్లో ఇడ్లీ తయారుచేసిన పిండి పులిసినట్లుగా ఉందని సూపరింటెండెంట్ అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరికి మాత్రమే వాంతులయ్యాయని, ఆస్పత్రికి వచ్చాక మళ్లీ కాలేదన్నారు. మిగతా 14మంది కేవలం వాంతులు అవుతాయన్న లక్షణాలతో ఆస్పత్రిలో చేరారని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడారు. ఇక, టీడీపీ నేతలు కంఠా రమేష్, రెడ్డివారి గురవారెడ్డి, బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్లతాంగల్ బాలాజీప్రసాద్రెడ్డి, సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య, పట్టణ కార్యదర్శి గోపి, విద్యార్థి సంఘాల నాయకులు, జనసేన, బీజేపీ, వైసీపీ నేత అంజూరు శ్రీనివాసులు, కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త దామోదర్రెడ్డి తదితరులు విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కాగా, 14 మంది విద్యార్థులను మధ్యాహ్నం డిశ్చార్జి చేశారు. భరత్, నవదీ్పకు కడుపు నొప్పి తగ్గలేదని చెప్పడంతో చిన్నపిల్లల వార్డుకు తరలించి చికిత్స అందించారు.
ఆస్పత్రిలో చేరిన వారు: రాజా, చరణ్, సుమన్కుమార్, ప్రేమ్కుమార్, చాన్, మహేంద్ర, ప్రేమ్కుమార్, విష్ణు, భరత్, రాజేష్, రోహిత్, జస్వంత్, రేవంత్, దేవేంద్ర, యశ్వంత్, నవదీప్.
ఇన్చార్జిగా తప్పుకోమని పరోక్ష బెదిరింపులు
నాలుగురోజుల క్రితం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించగానే.. తప్పుకోవాలంటూ నన్ను కొందరు పరోక్షంగా బెదిరించారు. ఉదయం 5 గంటలకే నేను హాస్టల్కు చేరుకుని టిఫిన్ అందించాక పిల్లలు అస్వస్థతగా ఉందని చెప్పారు. హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. పాపానాయుడుపేట, ఏర్పేడు వసతిగృహాల్లోనూ వార్డెన్గా పర్యవేక్షిస్తున్నా. ఇప్పటి వరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అభియోగం నాపై లేదు.
- వెంకటేశ్వర్లు, బీసీ హాస్టల్ ఇన్ఛార్జి వార్డెన్
నిబంధనల ప్రకారం వార్డెన్ నియామకం జరగాలి
ఫిబ్రవరి నుంచి నాలుగు రోజుల క్రితం వరకు ఇన్ఛార్జి వార్డెన్తో కాలం వెళ్లదీశారు. ఆయన బదిలీ అయ్యాక మళ్లీ ఇన్ఛార్జి వార్డెన్కు బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ వార్డెన్ను నియమించకపోవడం అధికారుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఇక, బీసీ హాస్టల్కు ఇతర వర్గాలకు చెందిన వార్డెన్లను నియమించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇక, ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు ఆ స్థాయి అధికారినే వార్డెన్గా నియమించాలి. కానీ, గతంలో పోస్టుమెట్రిక్ స్థాయి అధికారి రామయ్యను కొనసాగించారు. అందుకని నిబంధనల ప్రకారం రెగ్యులర్ వార్డెన్ను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.