Polavaram Project : పోలవరానికి మరో 2,500 కోట్లు!
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:23 AM
పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు అంగీకరించిన రూ.5,000 కోట్ల అడ్వాన్సులో మిగతా రూ.2,500 కోట్లు కూడా విడుదల చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కేంద్రం సూత్రప్రాయ అంగీకారం
వారంలోగా విడుదల చేసే అవకాశం
నేడు ప్రాజెక్టు సందర్శనకు మంత్రి నిమ్మల
అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు అంగీకరించిన రూ.5,000 కోట్ల అడ్వాన్సులో మిగతా రూ.2,500 కోట్లు కూడా విడుదల చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే తొలివిడతగా రూ.2,348 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రీయుంబర్స్మెంట్ కింద మరో రూ.459 కోట్లను కూడా మంజూరు చేసింది. అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభమైనందున అడ్వాన్సుగా ఇవ్వాల్సిన మిగతా రూ.2500 కోట్లను కూడా మంజూరు చేయాలని ఇటీవల కేంద్రాన్ని కోరినట్లు జల వనరుల శాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకు జలశక్తి శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించాయి. నిధులు విడుదల చేయాలన్న నిర్ణయం కూడా తీసుకుందని.. వారం రోజుల్లోపే ఆ మొత్తం రాష్ట్రానికి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా.. దావోస్ పర్యటన నుంచి వచ్చాక పోలవరం పనులు పరిశీలించేందుకు వెళ్తానని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇంకోవైపు.. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులకు టీ-16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్మి నిర్మాణ సంస్థ బావర్ వాడుతోందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి తెలిపారు. అంతర్జాతీయ నిపుణుల సూచన మేరకు కేంద్ర జలసంఘం ఆదేశాలతో బుధవారం నుంచి ఈ మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.