Bodies of Maoist Leaders: గాజర్ల రవి భౌతికకాయం అప్పగింత
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:01 AM
రవి మృతదేహాన్ని సోదరుడు అశోక్ స్వస్థలమైన తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి తీసుకెళ్లారు....
అరుణ, అంజూ మృతదేహాలు కూడా
మృతదేహాల స్వాధీనంలో పోలీసులు ఇబ్బందిపెట్టారు : కుటుంబసభ్యులు
పాడేరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు అరుణ, అంజూల మృతదేహాలకు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గురువారం అర్ధరాత్రి వారి కుటుంబీకులకు అప్పగించారు. రవి మృతదేహాన్ని సోదరుడు అశోక్ స్వస్థలమైన తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి తీసుకెళ్లారు. అరుణ మృతదేహాన్ని తండ్రి లక్ష్మణరావు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలేనికి తెచ్చుకున్నారు. మరో మావోయిస్టు అంజూ మృతదేహాన్ని ఆమె కుటుంబీకులు ఛత్తీ్సగఢ్ రాష్ట్రానికి తీసుకువెళ్లారు. అయితే మృతదేహాలను అప్పగించేందుకు పోలీసులు నానా ఇబ్బందులకు గురిచేశారని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తంచేశారు. దేవీపట్నం మండల పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి, అరుణ, అంజూ మృతిచెందిన విషయం తెలిసిందే.