Tobacco Cultivation Banned: పల్నాడు జిల్లాలో
ABN , Publish Date - Jun 21 , 2025 | 02:36 AM
పల్నాడు జిల్లాలో ఈ ఏడాది బ్లాక్ బర్లీ పొగాకు సాగు నిషేధించాం. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి అని కలెక్టర్ పీ.అరుణ్బాబు సూచించారు.
‘బ్లాక్ బర్లీ’ సాగు నిషేధం
నరసరావుపేట, జూన్ 20(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో ఈ ఏడాది బ్లాక్ బర్లీ పొగాకు సాగు నిషేధించాం. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి అని కలెక్టర్ పీ.అరుణ్బాబు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బ్లాక్ బర్లీ పొగాకు ధరలు పతనమవుతున్న దృష్ట్యా ఈ రకం పొగాకు సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించాం. ఆదాయం లేని పంటల సాగుకు రైతులు దూరంగా ఉండాలి. బ్లాక్ బర్లీ క్రాప్ హాలిడే గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలి. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉంది. మిర్చి, పత్తి వంటి పంటలకు సైతం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాల్సిన తరుణం వచ్చింది. గత సంవత్సరం మొక్కజొన్న రైతులకు మంచి దిగుబడి, ఆదాయం వచ్చింది’ అని కలెక్టర్ అన్నారు.
బ్లాక్ బర్లీ రైతులు ఆందోళన చెందవద్దు
బ్లాక్ బర్లీ పొగాకు రైతులు గిట్టుబాటు ధర విషయంలో ఆందోళన చెందవద్దు. మద్దతు ధరతో పంట కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యడ్లపాడు మార్క్ఫెడ్ కేంద్రంలో కొత్తగా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. ప్రభుత్వానికి బ్లాక్ బర్లీ పొగాకు అమ్మదలిచిన రైతులకు రిజిరేస్టషన్ తప్పనిసరి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే 1,600 మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయింది. రైతులు పొగాకు గ్రేడింగ్ చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి’ అని కలెక్టర్ సూచించారు.