Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో..పేర్ని గోదాం మేనేజర్ సహా ముగ్గురికి బెయిల్
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:16 AM
మాజీ మంత్రి పేర్ని నాని గోదాం నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులకు స్పెషల్ మొబైల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-2గా ఉన్న

రేషన్ బియ్యం మాయం కేసులో..పేర్ని గోదాం మేనేజర్ సహా ముగ్గురికి బెయిల్
మంజూరుచేసిన స్పెషల్ మొబైల్ కోర్టు
మచిలీపట్నం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పేర్ని నాని గోదాం నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులకు స్పెషల్ మొబైల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-2గా ఉన్న గోదాం మేనేజర్ మానస తేజ, ఏ-4గా ఉన్న మిల్లు యజమాని బాల ఆంజనేయులు, ఏ-5 లారీడ్రైవర్ మంగారావును మచిలీపట్నం తాలూకా పోలీసులు గత నెల 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి వీరు మచిలీపట్నం స్పెషల్ సబ్జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. రెండు విడతలుగా వీరిని కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. వీరికి కోర్టు రెండు సార్లు బెయిల్ తిరస్కరించింది. వారి బెయిల్ పిటిషన్లు గురువారం మరోసారి విచారణకు రాగా.. న్యాయాధికారి బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు... ఈ కేసులో ఏ-1గా గోదాం యజమాని, పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఏ-3గా ఉన్న పౌరసరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డికి వారం క్రితం బెయిల్ లభించింది. నిందితులను విచారించిన సమయంలో పేర్ని నాని సూచనలతోనే బియ్యం విక్రయించామని వారు చెప్పడంతో ఆయన్ను పోలీసులు ఏ-6గా చేర్చి కేసు నమోదుచేశారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. ఈ నెల 20వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కాగా.. పేర్ని నాని గోదాం నుంచి మచిలీపట్నంకు చెందిన మాతా వెంకటసుబ్బారావు, పి నాగేశ్వరరావు, గోపిశెట్టి నాంచారయ్య, కందుల బాపూజీ.. 1,600 బస్తాల రేషన్ బియ్యం కొనుగోలు చేసినట్లు తేలడంతో ఈ నెల 12వ తేదీన వీరిని అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచారు. ఈ నలుగురిని తమ కస్టడీకి ఇవ్వాలని తాలూకా పోలీసులు గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.