AP Police Recruitment: జూన్ 1న పోలీసు ఫైనల్ పరీక్ష
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:57 AM
రాష్ట్రంలోని 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షను జూన్ 1న నిర్వహించనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. 38,910 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించగా, హాల్టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పీఆర్బీ సూచించింది.
ఫిట్నె్సలో అర్హత సాధించిన 38,910 మంది అభ్యర్థులు
విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో కేంద్రాలు
జేఎన్టీయూ ఆధ్వరంలో నిర్వహణ: పీఆర్బీ ఛైర్మన్ వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోతున్న 6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు జూన్ 1న తుది పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(పీఆర్బీ) తెలిపింది. దేహధారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన 38,910 మంది తుది పరీక్షకు ఎంపికైనట్లు బోర్డు పేర్కొంది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిల్లోని పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే రాత పరీక్షను జేఎన్టీయూ నిర్వహిస్తుందని పీఆర్బీ వివరించింది. అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పీఆర్బీ ఛైర్మన్ మీనా ఒక ప్రకటనలో సూచించారు. వివరాల్లోకి వెళితే... రాష్ట్ర పోలీసు శాఖలో 6,100పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2022 నవంబరు 28న పీఆర్బీ నోటిపికేషన్ విడుదల చేసింది. సివిల్ పోలీసు విభాగంలో 3,580(పురుష, మహిళా అభ్యర్థులు).. ఏపీ స్పెషల్ పోలీసు విభాగంలో 2,520(పురుష) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రాథమిక రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 4.90లక్షల మంది 2023 ఫిబ్రవరిలో పరీక్ష రాయగా 95వేల మంది మాత్రమే కనీస అర్హత మార్కులు సాధించారు. వారిని శారీరక, దేహదారుఢ్య పరీక్షలకు పిలవకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసింది. హోంగార్డుల కోటా విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో జగన్ ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియను పూర్తిగా వదిలేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అభ్యర్థులు కూటమి పెద్దలకు తమ ఇబ్బందులు చెప్పడంతో ప్రక్రియ ప్రారంభమైంది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి పీఈటీ, పీఎంటీ పరీక్షలకు గత డిసెంబరు 30నుంచి పీఆర్బీ ఆహ్వానించింది. ఫిట్నెస్ పరీక్షల తర్వాత 38,910 మంది అభ్యర్థులు తుది పరీక్షకు ఎంపికయ్యారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..