Sankranti: బైక్స్ పైనా చలో చలో..
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:26 AM
సంక్రాంతి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవడానికి హైదరాబాద్లో ఉండే ఏపీ ప్రజలు మూడు రోజులుగా స్వగ్రామాలకు తరలి వస్తున్నారు.
వందల కిలోమీటర్లు బైక్లపైనే.. రైళ్లు, బస్సులు ఫుల్.. ప్రైవేటులో చార్జీల మోత
హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనాలపై స్వస్థలాలకు తరలిన జనం
మూడు రోజుల్లో ఏపీ వైపు 60 వేలకు పైగా బైక్లు.. సంక్రాంతి ప్రభావంతో హైదరాబాద్ ఖాళీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
సంక్రాంతి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవడానికి హైదరాబాద్లో ఉండే ఏపీ ప్రజలు మూడు రోజులుగా స్వగ్రామాలకు తరలి వస్తున్నారు. పండుగ రద్దీ వలన రైళ్లలో బెర్తులు లేక, ఆర్టీసీ బస్సులు సరిపోక.. ప్రైవేటు బస్సుల దోపిడీని భరించలేక చాలామంది కార్లలో బయల్దేరి వస్తున్నారు. కార్లు లేనివారు బైక్లపైనే ద్విచక్రవాహనాలపై వందల కిలోమీటర్లు గంగల తరబడి ప్రయాణించి మరీ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దీంతో నిత్యం బిజీ బిజీగా ఉండే నగర రహదారులు బోసిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని రోడ్లు ఆదివారం నాడు సాధారణం కంటే ఖాళీగా కనిపించాయి. కొన్ని రహదారులైతే నిర్మానుష్యంగా మారాయి.
ఎలాగైనా ‘సంక్రాంతికి వస్తున్నాం’
‘ఎలాగైనా పండగకి ఇంటికి వెళ్లాలి..’ సొంతూరిని వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి ఆలోచన ఇది. దీన్ని వ్యాపార వస్తువుగా మార్చుకున్న రవాణా సంస్థలు ప్రత్యేక సర్వీసుల పేరిట చార్జీల మోత మోగిస్తున్నాయి. రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్.. ఇలా అన్నీ ప్రత్యేక బాదుడు బాదేస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సును బట్టి రూ.500 నుంచి ప్రారంభమయ్యే టికెట్ ధర.. ఈ పండగ సీజన్లో వేలకు చేరింది. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ధరలను మూడింతలు పెంచేశాయి. ఈ ధరలు భరించలేక కొందరు ప్రమాణాలు వాయిదా వేసుకుంటే.. మరికొందరు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. కార్లు ఉన్న వారు తమ వాహనాల్లోనే బయల్దేరుతుంటే మరికొందరు దూరం, ప్రమాదాలను సైతం లెక్కచేయకుండా ద్విచక్రవాహనాలపై ఫ్యామిలీతో, లగేజీతో సొంతూళ్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బైక్పై వస్తున్న వ్యక్తిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొమరబండ వైజంక్షన్ వద్ద ఓ కారు ఢీకొట్టింది. ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
ఏపీ వైపు 60 వేలకు పైగా బైక్లు
టికెట్ చార్జీల మోత, బస్సులు, రైళ్లలో రద్దీ తాళలేక సొంత వాహనాల్లో ఏపీ వైపు ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. మూడు రోజుల్లో 2లక్షలకు పైగా వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలోని టోల్గేట్ల సిబ్బంది చెబుతున్నారు. గత 3 రోజుల్లో 60 వేలకు పైగా ద్విచక్రవాహనాలు ఏపీ వైపు వెళ్లాయని కొర్లపహాడ్ టోల్గేట్ సిబ్బంది తెలిపారు. మూడు రోజులుగా హైదరాబాద్- విజయవాడ మార్గంతోపాటు ముఖ్య పట్టణాలను చేరుకునే రహదారులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.