Midday meals : మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు!
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:56 AM
మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాల్లో తృణధాన్యాలను చేర్చాలని, ఏపీ మిషన్ మిల్లెట్ పథకం ద్వారా జొన్నలు, రాగులు తదితరాల వినియోగాన్ని ప్రోత్సాహించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.

మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయం
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనం, సంక్షేమ పథకాల్లో తృణధాన్యాలను చేర్చాలని, ఏపీ మిషన్ మిల్లెట్ పథకం ద్వారా జొన్నలు, రాగులు తదితరాల వినియోగాన్ని ప్రోత్సాహించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ధరల పర్యవేక్షణకు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమై మార్కెట్లో ధరల పరిస్థితిపై సమీక్షించింది. మంత్రులు పయ్యావుల కేశవ్(ఆర్థిక), అచ్చెన్నాయుడు(వ్యవసాయ), సత్యకుమార్(ఆరోగ్య), ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గతేడాదితో పోల్చితే కందిపప్పు 13 శాతం, వేరుశెనగ నూనె 4 శాతం, మిర్చి 27 శాతం ధరలు తగ్గాయని మంత్రులు తెలిపారు. ధరల అదుపునకు తగు చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మార్కెట్ ధరలపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 154 మండల కేంద్రాల నుంచి, 151 రైతు బజార్ల నుంచి ప్రతిరోజూ సీపీ యాప్ ద్వారా ధరలు సేకరిస్తూ వాటిపై విశ్లేషణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.