CM Chandrababu Naidu : పార్లమెంట్ కమిటీల కూర్పుపై ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం
ABN , Publish Date - Aug 23 , 2025 | 10:13 PM
పార్లమెంట్ కమిటీల కూర్పుపై సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు. మొత్తం 34 మంది సభ్యులతో ..
అమరావతి, ఆగస్టు 23 : టీడీపీ పార్లమెంట్ కమిటీల కూర్పుపై సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలతో చంద్రబాబు చర్చించారు. మొత్తం 34 మంది సభ్యులతో పార్లమెంట్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
అధ్యక్షునితో పాటు ఏడుగురు చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్య నిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులతో పార్లమెంట్ కమిటీ ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి పార్లమెంట్ స్థాయిలో 54 సాధికార సమితుల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మీటింగ్లో చంద్రబాబు వ్యాఖ్యలు :
అధికారంలోకి వచ్చిన తరవాత అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం.
గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. అయినా అన్నీ ఎదుర్కొని మనం సంక్షేమం చేస్తున్నాం.. అభివృద్ది ఆగకుండా చూస్తున్నాం.
సూపర్ సిక్స్ అని చెప్పాం.. చెప్పినట్లు అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం.
మ్యానిఫెస్టోలో అనేక హామీలు ఇప్పటికే నెరవేర్చాం. పథకాలు సకాలంలో అమలు వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.
ప్రతి వర్గానికి ఏదోక లబ్ది చేకూర్చాం. ఏడాది కాలంలో ఇన్ని పనుల చేయడం గొప్ప ముందడుగు.
వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది.
వాళ్లు ఫేక్ ప్రచారాలనే రాజకీయ సిద్దాంతంగా పెట్టుకుని రోజువారీ రాజకీయం చేస్తున్నారు.
ప్రజల సమస్యలు, ప్రజల ప్రయోజనాలు వాళ్లకు అనవసరం.
వాళ్లకు కావాల్సింది.. రాద్దాంతం.. తప్పుడు ప్రచారం.. మంచిపై చర్చ జరగకుండా చూడడం.
నిత్యం తప్పుడు ప్రచారంతో ప్రభుత్వ పథకాలపై, మంచి కార్యక్రమాలపై చర్చ జరగకుండా చేస్తున్నారు.
అమరావతి మునిగిపోయింది.. ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయి అంటూ అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
సింగయ్యను చంపేసి దాన్ని కూడా ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు.
లో లెవల్ పొలిటికల్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలు వైసీపీ చేస్తోంది.
వాళ్లే వివాదం సృష్టించి.. వాళ్లే క్రైం చేసి మళ్లీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
అర్హుల పింఛన్లు తొలగించలేదు.. కానీ వైసీపీ ప్రచారం మాత్రం లక్షల పింఛన్లు తొలగించినట్లు సాగుతోంది.
వైసీపీ ప్రతిపక్షం కాదు.. ఒక విష వృక్షం
తప్పుడు ప్రచారాలతో నిత్యం వాళ్ల రాజకీయాలు సాగుతున్నాయి.
ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలి.
వైసీపీ విధానాలను, కుట్రలను ఉదాహరణలతో చెపితే ప్రజలు అర్థం చేసుకుంటారు.
గెలిచాం.. అధికారంలో ఉన్నాం అని తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండకూడదు.
సంక్షేమ పథకాలపై చర్చ జరగకూడదనేది వైసీపీ ప్రధాన లక్ష్యం.. కానీ చేసిన మంచిపై మనం ప్రజలకు నిత్యం వివరించాలి.
సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహిద్దాం. ప్రజల్లో ఉన్న సానుకూలతను పెంచుకునేలా పార్టీ నేతలు ప్రజల్లో తిరగాలి. వారితో మమేకం అవ్వాలి.
పార్టీపై ఫోకస్ పెట్టి బలోపేతం చేసుకోవాలి.. తెలుగు దేశం పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంటుంది.
అనేక సవాళ్లను మనం ఎదుర్కొన్నాం. అనేక పోరాటాలు చేశాం. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం.
పార్టీని రీ ఆర్గనైజ్ చేశాం.. రీ స్ట్రక్చర్ చేశాం.. యువతకు అవకాశాలు ఇస్తున్నాం.
తెలుగు దేశం సిద్దాంతం చాలా బలమైనది.. చాలా విశిష్టమైనది. అందుకే ఇన్నేళ్లుగా ప్రజల ఆదరణ పొందుతోంది.
సంస్థాగతంగా బలమైన, అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ మన తెలుగు దేశం.
పార్టీలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండాలి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు మరింత బాధ్యతగా ఉండాలి.
ఎన్నో పోరాటాలు చేసి నేడు మనం ఇక్కడికి వచ్చాం. గత 5 ఏళ్లు అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డాం అనేది మరిచిపోకూడదు. పార్టీ ఇమేజ్ ను, ప్రభుత్వ ఇమేజ్ ను పెంచేలా నేతల తీరు ఉండాలి.
పార్టీపై ఫోకస్ పెట్టాను. పార్టీలో కింది స్థాయి నుంచి పై వరకు బలమైన స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నాం.
పార్లమెంట్ కమిటీల నియామకం అత్యంత పాదర్శకంగా, పకడ్బందీగా జరగాలి.
కమిటీ నియామకంలో సోషల్ రీయింజనీరింగ్ జరగాలి. అన్ని వర్గాలకు, బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలి.
మొహమాటాలకు పోయి డమ్మీలు, వీక్ గా ఉండే వాళ్లను పెడితే ప్రభుత్వం, పార్టీ నష్టపోతాయి.
ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అలసత్వం తగదు.. పార్టీ కమిటీలు బలంగా ఉండాలి. యాక్టివ్ గా ఉండాలి.