Andhra Pradesh health survey: వెంటాడుతున్న వ్యాధులు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:31 AM
విజన్-2047లో భాగంగా ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంతో రాష్ట్రం 2.15 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించింది. డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు విస్తరిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది.
ఏపీలో ప్రజల ఆరోగ్యంపై సమగ్ర సర్వే
18 ఏళ్లు దాటిన 2.15 కోట్ల మందికి స్ర్కీనింగ్
భవిష్యత్ కార్యాచరణకు సన్నద్ధం
ప్రతి నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ
19.78 లక్షల మందికి బీపీ
11.13 లక్షల మందికి డయాబెటిస్
రెండూ ఉన్నవారు 20.78 లక్షలు
2,61,100 మందికి గుండె సమస్యలు
2 లక్షలకుపైగా క్యాన్సర్, కిడ్నీ రోగులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి) రాష్ట్ర వృద్ధిరేటులో ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుత్వం నిర్దేశించుకున్న 15 శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుంది. విజన్-2047లో భాగంగా ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వ్యాధులను గుర్తించి, ప్రబలడానికి గల కారణాలపై ప్రత్యేక సర్వే నిర్వహించింది. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు గుండె, కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాల కేసులపై ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా పరిశోధన నిర్వహించింది. 18 ఏళ్ల వయసు దాటిన 2.15 కోట్ల మందికి (52.43 శాతం) స్ర్కీనింగ్ చేయించింది. సోమవారం సీఎం చంద్రబాబు వివరాలను వెల్లడించారు. భారీ స్థాయిలో అనారోగ్య సమస్యలు పెరగడానికి జీవన విధానంలో మార్పులే కారణమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో బాధితుల సంఖ్య అధికంగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి జిల్లాల్లో ఆరోగ్య శాఖ చేపట్టిన సర్వేలో ఎక్కువ శాతం కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని పరిశోధన చేశారు. 10 రకాల వ్యాధులపై అధ్యయనం చేశారు. వ్యాధుల నిర్ధారణకు స్ర్కీనింగ్ చేయగా కొన్ని జిల్లాల్లో కొన్ని వ్యాధులు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి.
రాష్ట్రంలో డయాబెటిస్ లేదా హైపర్ టెన్షన్ ఉన్నవారు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. రెండూ ఉన్నవారు 20 లక్షల మంది ఉన్నారు. ఒకప్పుడు చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇంకా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు. దీర్ఘకాలిక రోగాలతో లక్షలాది మంది ప్రజలు సతమతమవుతున్నారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్పై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేయించిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. 18 ఏళ్ల వయసు దాటిన 2.15 కోట్ల మందికి (52.43 శాతం) స్ర్కీనింగ్ చేయించింది. వ్యాధులపై ముందే అప్రమత్తం కావడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన చికిత్స, నివారణ చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
హైపర్ టెన్షన్
రాష్ట్రంలో 19.78 లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అంటే... 9.2 శాతం మందికి అన్నమాట. పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 11,40,772 మంది మహిళలకు, 8,37,927 మంది పురుషులకు హైపర్ టెన్షన్ ఉంది. మరో 14.29 లక్షల మంది అండర్ ఫాలో అప్ కేటగిరిలో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు ఎక్కువగా ఉంది. సత్యసాయి, మన్యం, అల్లూరి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.

డయాబెటిస్
11.13 లక్షల మందికి అంటే జనాభాలో 5.1 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు తేలింది. మహిళల కన్నా పురుషులకే ఎక్కువగా ఉంది. 5,61,196 మంది పురుషులకు, 5,52,767 మంది మహిళలకు డయాబెటిస్ నిర్ధారణ అయింది. మరో 8.76 లక్షల మంది అండర్ ఫాలో అప్ కేటగిరిలో ఉన్నారు. అంటే.. వీరంతా డయాబెటిస్ రిస్క్లో ఉన్నారని అర్థం. జిల్లాల వారీగా చూస్తే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ప్రజలకు డయాబెటిస్ ఎక్కువగా ఉంది. అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీసత్యసాయి జిల్లాలో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.
డయాబెటి్స-హైపర్ టెన్షన్
డయాబెటిస్, హైపర్ టెన్షన్ రెండూ 20.78 లక్షల మందికి అంటే.. 9.6 మందికి ఉన్నట్టు తేలింది. వారిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. 11,22,800 మంది మహిళలకు, 9,54,707 మంది పురుషులకు డయాబెటిస్, హైపర్ టెన్షన్ రెండూ ఉన్నాయి. అండర్ ఫాలో అప్ కేటగిరిలో మరో 12.80 లక్షల మంది ఉన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా, అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తక్కువగా కేసులు నమోదయ్యాయి.
గుండె సంబంధిత వ్యాధులు
2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నిర్ధారించారు. వీరిలో పురుషులు 1,67,734 మంది, మహిళలు 99,366 మంది ఉన్నారు. ఎన్టీఆర్, నంద్యాల, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.
క్యాన్సర్
నేడు సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో క్యాన్సర్ ప్రధానమైనది. భవిష్యత్తులో బాధితుల సంఖ్య 20 నుంచి 30 శాతం ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,19,397 మంది క్యాన్సర్ రోగులున్నట్లు తేలింది. కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, మన్యం, సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
కాలేయ సమస్యలు
రాష్ట్రంలో 30,646 మంది కాలేయ సమస్యలతో బాధుపడుతున్నారు. వీరిలో 21,740 మంది పురుషులు, 8,906 మంది మహిళలు ఉన్నారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, శ్రీసత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
శ్వాస సంబంధిత సమస్యలు
రాష్ట్రంలో 54,362 మంది శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో 35,088 మంది పురుషులు, 19,274 మంది మహిళలున్నారు. నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, పశ్చిమగోదావరి, బాపట్ల జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
నరాల సంబంధిత వ్యాధులు
రాష్ట్రంలో 1,07,433 మంది నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 63,698 మంది పురుషులు, 43,735 మంది మహిళలు ఉన్నారు. విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, శ్రీసత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
కిడ్నీ సమస్యలు
రాష్ట్రంలో 1,73,479 మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. వారిలో 1,22,672 మంది పురుషులు, 50,807 మంది మహిళలు ఉన్నారు. శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
డేంజర్ బెల్స్
హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధుల విషయంలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
జీవన విధానం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువగా కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నమోదవుతున్నాయి.
వాయుకాలుష్యం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియో, సీవోడీపీ కేసులు ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అఽధికంగా నమోదవుతున్నాయి.
టీబీ, డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు.
హైపర్ టెన్షన్, డయాబెటిస్, తాగునీటి కాలుష్యంతో అనారోగ్యం బారినపడుతున్నవారు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు.
పొగాకు ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ రోగులు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు.
ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ కేసులు విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.
వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే చికెన్గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు అల్లూరి, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.
జూన్ నాటికి స్ర్కీనింగ్
ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో ప్రజలందరికి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడం ద్వారా రోగాల బారినపడే అవకాశాన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చని చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై మరింత అధ్యయనం, పరిశీలన, పరిశోధన అవసరం ఉంది.
నియోజకవర్గానికో మల్టీ స్పెషాలిటీ
ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే దాదాపు 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులున్నాయి. మరో 105 నియోజకవర్గాల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన 2.15 కోట్ల మందికి స్ర్కీనింగ్ వారిలో వివిధ రోగాల బారినపడ్డ వారు
హైపర్ టెన్షన్
జనాభాలో 9.2 శాతం
మహిళలు 11,40,772
పురుషులు 8,37,927
మొత్తం 19.78 లక్షల మంది
అండర్ ఫాలో అప్ కేటగిరిలో మరో
14.29 లక్షల మంది
డయాబెటిస్
జనాభాలో 5.1 శాతం
పురుషులు 5,61,196
మహిళలు 5,52,767
మొత్తం 11.13 లక్షల మంది
అండర్ ఫాలో అప్ కేటగిరిలో మరో 8.76 లక్షల మంది
డయాబెటి్స-హైపర్ టెన్షన్
జనాభాలో 9.6 శాతం
మహిళలు 11,22,800
పురుషులు 9,54,707
మొత్తం 20.78 లక్షల మంది
అండర్ ఫాలో అప్ కేటగిరిలో మరో
12.80 లక్షల మంది
గుండె సంబంధిత వ్యాధులు
పురుషులు 1,67,734
మహిళలు 99,366
మొత్తం 2,61,100
క్యాన్సర్
పురుషులు 46,872
మహిళలు 72,525
మొత్తం 1,19,397
కిడ్నీ సమస్యలు
పురుషులు 1,22,672
మహిళలు 50,807
మొత్తం 1,73,479
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..