Secretariat సిబ్బందిలేక సచివాలయం వెలవెల
ABN , Publish Date - May 23 , 2025 | 11:03 PM
మండలంలోని వెలిచెలమల సచివాలయంలో సిబ్బంది ప్రజలకు సరిగా అందుబాటులో ఉండటం లేదనే విమర్శలున్నాయి.
నంబులపూలకుంట, మే 23(ఆంధ్రజ్యోతి) : మండలంలోని వెలిచెలమల సచివాలయంలో సిబ్బంది ప్రజలకు సరిగా అందుబాటులో ఉండటం లేదనే విమర్శలున్నాయి. నూతనంగా రేషనకార్డుల మంజూరు, కార్డుల్లో చేర్పులు, మార్పులు చేయించుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తుర్వులు విడుదల చేసింది. దీంతో తాము పలుమార్లు కార్యాలయానికి వెళ్లినా .. సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, దీంతో వెనుదిరగాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. వెలిచెలమలతో పాటు గౌకనపేట సచివాలయానికి ఒకే డిజిటల్ అసిస్టెంట్ ఉండడంతో ఎక్కడ ఉంటారో అర్థం కావడంలేదని ఆవేదన చెందారు. దీంతో ఆంధ్రజ్యోతి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆ సచివాలయాన్ని విజిట్ చేసింది. ఆ సమయంలో సిబ్బంది ఒక్కరు కూడా ఆ కార్యాలయంలో లేరు. ఈ విషయంపై ఫోన్లులో ఎంపీడీఓ పార్థసారధిని వివరణ కోరగా.. పరిశీలించి, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.