వంతెన నిర్మాణం పూర్తి
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:36 AM
మండలంలోని గుండ్లపల్లి క్రాస్ సమీపంలోని హగరి నదిపై వంతెన నిర్మాణం పూర్తయింది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆ వంతెన కొట్టుకుపోయింది.
బెళుగుప్ప, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుండ్లపల్లి క్రాస్ సమీపంలోని హగరి నదిపై వంతెన నిర్మాణం పూర్తయింది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆ వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆటోలు.. ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. గుండ్లపల్లి క్రాస్కు చెందిన అనేకమంది హోటళ్లు, కాయలు, పండ్లు, చిరువ్యాపారులు చేసుకుంటూ ఉపాధి పొందేవారు. ఈ వంతెన కొట్టుకొని పోవడంతో వాహనాలు రాక వారు ఉపాధి కోల్పోయినట్లు అయింది. అంతేకాకుండా విద్యార్థులు, ప్రజలు అర కిలోమీట రు నడిచి జాతీయ రహదారి వద్దకు చేరుకొని.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పోవాల్సిన దుస్థితి నెలకొంది. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి రాత్రివేళ రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ వంతెనను నిర్మించాలని నాడు అధికారంలో ఉన్న వైసీపీ పాలకులు, నాయకులను గ్రామస్థులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. తాము అధికారంలోకి వస్తే.. ఈ వంతెనను నిర్మిస్తామని ఎన్నికల ప్రచారంలో పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే.. ఈ వంతెన నిర్మాణానికి మంత్రి కేశవ్ రూ.13 కోట్లు మంజూరు చేయించారు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుతం వంతెన నిర్మాణం పూర్తయి.. ప్రారంభానికి సిద్ధంగా ఉంది.