Share News

Shortage కళాశాలలో అధ్యాపకుల కొరత

ABN , Publish Date - May 10 , 2025 | 12:28 AM

స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు లెక్చరర్లను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Shortage  కళాశాలలో అధ్యాపకుల కొరత
తాడిమర్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

తాడిమర్రి, మే 9(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు లెక్చరర్లను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇతర కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులను ఇక్కడికి నియమించుకుని పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. పదేళ్లుగా ఈ తంతు సాగుతున్నా దీని గురించి పట్టించుకున్న నా థుడేలేడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు ఈ కళాశాల నుంచి ప్రథమ సంవత్సరం 57 మంది, ద్వితీయ సంవత్సరం 27 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది మరో 100 మందికిపైగా విద్యార్థులు కళాశాలలో చదువుకునేందుకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఇన్నాళ్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన అధ్యాపకులు కాకుండా ఈ ఏడాదైన రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇటీవల మండలంలో పర్యటించిన మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ దృష్టికి విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యను తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి అప్పటికప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే లెక్చరర్లను నియమించాలని మంత్రి ఆదేశించి మూడు నెలలు గడుస్తున్నా విద్యాశాఖ నుంచి స్పందన లేదు. మరో నెల రోజుల్లో కళాశాల ప్రారంభమవుతున్న దృష్య్టా సబ్జెక్టు లెక్చరర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

నివేదికలు పంపాం: సయ్యద్‌మౌలా, డీఐఈఓ

తాడిమర్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు అధ్యాపకులను కేటాయించాలని ఉన్నత విద్యాశాఖ అధికారికి నివేదికలు పంపాం. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అదనంగా ఉన్న అధ్యాపకులను తాడిమర్రితో పాటు ఇతర కళాశాలలకు కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే అదనపు అధ్యాపకుల వివరాలను అడిగి తీసుకున్నారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.

Updated Date - May 10 , 2025 | 12:28 AM