patients కరెంట్ లేక రోగుల పాట్లు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:52 AM
ట్రాన్సఫార్మర్ మరమ్మతుల కారణంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ లేదు.
గుంతకల్లుటౌన, జూన 16 (ఆంధ్రజ్యోతి): ట్రాన్సఫార్మర్ మరమ్మతుల కారణంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ లేదు. ఈ ఆసుపత్రికి జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆ ఆసుపత్రికి వచ్చిన డయాలిసిస్ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరితో పాటు ఎక్స్రే, రక్తపరీక్షలు కోసం రోగులు నిరీక్షించారు. ఉక్కుపోతతో బాలింతలు, నవజాత శిశువులు, చికిత్స పొందుతున్న వృద్ధులు, మహిళలు అల్లాడిపోయారు. క్యాజువాలిటీలో మాత్రం ఇన్వర్టర్ సౌకర్యం ఉంది. మిగిలిన వార్డులకు ఇన్వర్టర్ సౌకర్యం లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. రోగులు ఆసుపత్రి బయటకు వెళ్లి.. చెట్ల కింద కూర్చున్నారు. ఆస్పత్రిలో జనరేటర్ ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు ఆసుపత్రి అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని రోగులు, ప్రజలు వాపోతున్నారు. దీనిపై ఆస్పత్రి ఇనచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ జనార్ధనరెడ్డిని వివరణ కోరగా.. పది రోజుల్లో ఆస్పత్రిలో జనరేటర్ ఏర్పాటు చేస్తామన్నారు.