cpi మంత్రి ఇలాకాలో అక్రమాలు పట్టించుకోరా..!
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:15 AM
మంత్రి సత్యకుమార్ ఇలాకాలో.. 650-2 సర్వేనెంబరులో రూ.50 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అక్రమార్కులు పాలైందని ధర్నాలు చేస్తున్నా.. పట్టించుకునేవారే లేరా అని సీపీఐ నాయకులు మండిపడ్డారు.

ధర్మవరం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మంత్రి సత్యకుమార్ ఇలాకాలో.. 650-2 సర్వేనెంబరులో రూ.50 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి అక్రమార్కులు పాలైందని ధర్నాలు చేస్తున్నా.. పట్టించుకునేవారే లేరా అని సీపీఐ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సీపీఐ నియోజకవర్గ ఇనచార్జ్ ముసుగు మధు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, ఫ్లంబర్లు బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పేదల పేర్లు చెప్పుకుని ప్లంబర్ల్ యూనియన నాయకులు, వైసీపీ నాయకులు కుమ్మక్కై ఆ భూమిని అర్హులైన వారికి అందకుండా బినామీ పేర్లతో ఆ భూమిని నొక్కేశారన్నారు. వీరికి నాటి తహసీల్దార్ రమేశ పూర్తిగా సహకరించారన్నారు. యూనియన పేరు చెప్పుకుని ముగ్గురు వ్యక్తులు దాదాపు 30 నుంచి 35 పట్టాలు బినామీ పేర్లతో దోచేశారన్నారు. అప్పటి అధికార పార్టీ వైసీపీ సహకరించినందుకు నజరానాగా నాటి ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులకు కూడా 10 పట్టాలు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. ఈ అవినీతిపై ఇంతగా ఆందోళన చేసున్నా... మంత్రి, అధికారులు పట్టించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. విధులకు వెళ్లకుండా రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో తహసీల్దార్ నటరాజ్ అక్కడికి వచ్చారు. విచారణ జరిపి బోగస్ అని తేలితే కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ఈ ధర్నాలో సీపీఐ నాయకులు రవికుమార్, రమణ, చేనేత నాయకులు పోలా లక్ష్మీనారాయణ, వెంకటస్వామి, సకలరాజ, పెద్దన్న, నాగభూషణ, ప్లంబర్స్ గోవిందురాజు, తాజ్, సుబ్బయ్య, రామకృష్ణ, శ్రీరాములు,నాగరాజు, మనోహర్, బాబావలి, మసూద్, మస్తాన, కేశవ, రామాంజి, రమేశ పాల్గొన్నారు.