డివైడర్లతో పెరిగిన ట్రాఫిక్ ఇబ్బందులు
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:32 AM
కొండనాలిక్క మందే స్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా ఉంది గుంతకల్లు మున్సిపల్ అధికారుల తీరు. సాధారణంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్లపై డివైడర్లను ఏర్పాటుచేస్తారు.
గుంతకల్లు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కొండనాలిక్క మందే స్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా ఉంది గుంతకల్లు మున్సిపల్ అధికారుల తీరు. సాధారణంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్లపై డివైడర్లను ఏర్పాటుచేస్తారు. కానీ గుంతకల్లు పట్టణంలో అనవసరమైన చోట.. ఇరుకుగా ఉన్న రహదారిలో డివైడ ర్లు ఏర్పాటు చేశారు. వీటి కారణంగా తరచుగా ట్రాఫిక్ జాం అవుతోంది. పట్టణంలోని టంగుటూరు కాంప్లెక్స్కు సమీపంలోని రోడ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకూ గతంలో డివైడర్లు ఉండేవి కావు. గతనెలలో ఈ ప్రదేశంలో మున్సిపల్ అధికారులు దాదాపు 150 మీటర్ల మేర టూవేగా మార్చి డివైడర్లను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచీ ఈ రోడ్డుపై తరచుగా ట్రాఫిక్ జాం అవుతోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం వేసిన డివైడర్ల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సిన అంబులెన్స, ఫైరింజన ఈ ట్రాఫిక్ జాంలో ఉండిపోతున్నాయి. అంతేకాకుండా భారీ వర్షం కురిసినప్పుడు నీటి ప్రవాహానికి ఆ డివైడర్లు రోడ్డు పై అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు వాటిని మరలా యథాస్థానానికి చేర్చేవరకూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. అవసరంలేని చోట డివైడర్లను ఏర్పాటుచేయడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వర్షం కారణంగా ఇబ్బంది సమస్య ఏర్పడిన చోట కొన్ని డివైడర్లను తొలగించామని, డివైడర్ల విషయంగా పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ ఇంజనీరు ఇంతియాజ్ వివరణ ఇచ్చారు.