Share News

school ఆ సార్‌ వస్తే.. స్కూల్‌కు తాళమేస్తాం

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:25 AM

బడేనాయక్‌తండాలోని మండల ప్రజాపరిషత పాఠశాల ఉపాధ్యాయుడిగా శంకర్‌నాయక్‌ వద్దని, ఆయన వస్తే ఈ పాఠశాలకు తాళం వేస్తామని ఆ తండావాసులు తేల్చిచెప్పారు.

school  ఆ సార్‌ వస్తే.. స్కూల్‌కు తాళమేస్తాం
ఎంఈఓతో మాట్లాడుతున్న బడే నాయక్‌ తండా వాసులు

పుట్టపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): బడేనాయక్‌తండాలోని మండల ప్రజాపరిషత పాఠశాల ఉపాధ్యాయుడిగా శంకర్‌నాయక్‌ వద్దని, ఆయన వస్తే ఈ పాఠశాలకు తాళం వేస్తామని ఆ తండావాసులు తేల్చిచెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. గతంలో బడేనాయక్‌తండా ఎంపీపీ పాఠశాల హెచఎంగా శంకర్‌నాయక్‌ పనిచేసేవారు. ఆయన మద్యం తాగి పాఠశాలకు వస్తున్నారని, పిల్లల భవిష్యతను చెడగొడతున్నారని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తండావాసులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన విద్యాశాఖ ఉన్నతాధికారులు అతన్ని సస్పెండు చేశారు. సస్పెన్షన తర్వాత మరో పాఠశాలకు బదిలీ చేయాల్సిన విద్యాశాఖాధికారులు... తిరిగి ఆ పాఠశాలకే ఉపాధ్యాయుడిగా నియమించారు. విధుల్లో చేరిన ఆయనలో ఎలాంటి మార్పూ రాలేదని, తాగి విధులకు వస్తున్నారని మళ్లీ ఆ తండా వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓ ఖాదర్‌వలి విచారణ నిమిత్తం ఆ గ్రామానికి శుక్రవారం వెళ్లారు. ఆ తండావాసులు మాట్లాడుతూ.. అతన్ని తమ పాఠశాల నుంచి బదిలీ చేయాలని, లేకుంటే పాఠశాలకు తాళాలు వేస్తామని ఆ గ్రామస్థులు తేల్చిచెప్పారు.

Updated Date - Apr 05 , 2025 | 12:25 AM