water problem నాలుగు నెలలుగా తాగునీటి సమస్య
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:13 AM
తాము నాలుగు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండలంలోని వడ్రవన్నూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు వాపోయారు.
రాయదుర్గంరూరల్, జూన 28(ఆంధ్రజ్యోతి): తాము నాలుగు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండలంలోని వడ్రవన్నూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు వాపోయారు. ఈ మేరకు వారు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఆరునెలల కితం శ్రీరామిరెడ్డి పథకం నీరు వచ్చేవని, నాలుగు నెలల నుంచి పంచాయతీ బోర్ నుంచి సక్రమంగా ఇవ్వకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాగునీటి కోసం రాత్రి 12 గంటల సమయంలో బిందెలు పట్టుకొని.. వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాల్సి వస్తోందన్నారు. తప్పనిపరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 10 నుంచి రూ. 15లకు బిందె, క్యాన్లతో నీరు కొనుగోలు చేసుకుని తాగుతున్నట్లు తెలిపారు. మొహరం పండుగ వస్తోందని, అధికారులు ఇప్పటికైనా స్పందించాలని శాంతమ్మ, కమలాక్షి, కొల్లమ్మ, రుద్రమ్మ తదితరులు విజ్ఞప్తి చేశారు.