రూ. 40.85 లక్షలతో పరార్
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:22 AM
పంట పెట్టుబడి పేరుతో 43 మంది రైతుల నుంచి రూ. 40.85 లక్షలు అప్పు చేసిన ఓ రైతు పరారయ్యాడు.
బొమ్మనహాళ్, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): పంట పెట్టుబడి పేరుతో 43 మంది రైతుల నుంచి రూ. 40.85 లక్షలు అప్పు చేసిన ఓ రైతు పరారయ్యాడు. మండలంలోని దర్గాహొన్నూరుకు చెందిన రైతు మనోహర్ తన నాలుగు ఎకరాల్లో మిరప పంటను సాగు చేయడానికి రెండు, మూడు సంవత్సరాలుగా 43 మంది రైతుల వద్ద అప్పులు చేశాడు. తోటి రైతే కాదా అని నమ్మి వారు అప్పులిచ్చారు. అయితే వారికి ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించని మనోహర్ గుట్టుచప్పుడు కాకుండా తన పేరున ఉన్న నాలుగు ఎకరాల భూమిని, ఇంటిని అమ్మేసుకున్నాడు. అప్పులిచ్చిన రైతులకు ఐపీ నోటీసులు పంపించి పరారయ్యాడు. నోటీసులు అందుకున్న రైతులు ఒక్కసారిగా షాక్కు గురై పోలీసులను ఆదివారం ఆశ్రయించారు. ఆ స్టేషన ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మనోహర్పై కేసు నమోదు చేసి ఆమ్మేసిన భూమి, ఆస్తులను గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు రత్నమ్మ, చిన్నహనుమంతు, సువర్ణమ్మ, నజీర్, బండి పద్మాక, బండి ఆంజనేయ, ఈశ్వరమ్మ తదితరులు డిమాండ్ చేశారు.