Anantapur Jailor Subbareddy: అజ్ఞాతంలోకి అనంత జైలర్
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:22 AM
అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలులో జైలర్ సుబ్బారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 20 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. మహిళను న్యూడ్ కాల్ చేయాలని ఒత్తిడి చేసినందుకు విశాఖ సైబర్ క్రైం పోలీసుల వద్ద కేసు నమోదైన నేపథ్యంలో, సుబ్బారెడ్డి విధులకు హాజరు కాకుండా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు

న్యూడ్ కాల్ చేయాలని మహిళపై సుబ్బారెడ్డి ఒత్తిడి!
కేసు నమోదు కావడంతో పరార్
బుక్కరాయసముద్రం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలు జైలర్ సుబ్బారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 20 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. న్యూడ్ కాల్ చేయాలని ఓ మహిళను ఒత్తిడి చేసినందుకు జైలర్ సుబ్బారెడ్డిపై విశా ఖ సైబర్ క్రైం పోలీసుస్టేషన్లో గత నెలలో కేసు నమోదైంది. సుబ్బారెడ్డిని విచారించేందుకు విశాఖ నుంచి ప్రత్యేక పోలీసు బృందం అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చి 23న వచ్చినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఆయన.. పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మార్చి 23 నుంచి ఆయన విధులకు హాజరు కావడం లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని జైలు సూపరిండెంటెంట్ ఏబీ క్రాంతిరాజ్ శుక్రవారం తెలిపారు. కుటుంబ సభ్యులను ఆరాతీయగా, అనారోగ్యంగా ఉన్నాడని, ఆస్పత్రికి వెళ్లాడని చెప్పారని అన్నారు. అయితే, అదే రోజున వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి, మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరాడని తెలిపారు.అనంతరం జైళ్ల శాఖకు మెయిల్ ద్వారా మార్చి 23 నుంచి ఏప్రిల్ 11 వరుకు సెలవు కావాలని లేఖ పంపించారని తెలిపారు. సుబ్బారెడ్డి మెడికల్ లీవ్ శుక్రవారంతో ముగిసింది. ఆయన విధులకు రాగానే సమాచారం ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్కు విశాఖ పోలీసులు సూచించారని సమాచారం.