Share News

Amaravati: లక్ష్యం.. మూడేళ్లు

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:28 AM

ఐదేళ్ల పాటు విధ్వంసాన్ని తట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మూడేళ్లలో సిద్ధం కానుంది. ఈ మేరకు రాజధాని నిర్మాణ పనులు పూర్తిచేయడానికి సీఆర్‌డీఏ ఒక టైమ్‌ టేబుల్‌ను రూపొందించుకుంది. ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్న పనులన్నింటినీ గరిష్ఠంగా మూడేళ్లలో పూర్తి చేయాలని, రాజధానికి ఒక రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Amaravati: లక్ష్యం.. మూడేళ్లు

రాజధాని పనులకు సీఆర్‌డీఏ టైమ్‌ టేబుల్‌

క్షేత్రస్థాయి పనులకు కార్యాచరణ ప్రణాళిక

మార్చి 8న ముగియనున్న ఎమ్మెల్సీ కోడ్‌

ఆరోజే ఎల్‌ఓఏలు.. మార్చి 15న టెండర్లు ఖరారు

ఉగాదికి సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం సిద్ధం

రెండున్నరేళ్లలో ఐకానిక్‌ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యం

కోడ్‌ ముగియగానే కేంద్ర సంస్థలకు భూ కేటాయింపులు

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రత్యామ్నాయ ఆలోచనలు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ.. చకచకా కదులుతున్న ఫైళ్లు.. సిద్ధంగా ఉన్న నిధులు.. వరుసగా మొదలవుతున్న పనులు.. ఐదేళ్ల పాటు విధ్వంసాన్ని తట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మూడేళ్లలో సిద్ధం కానుంది. ఈ మేరకు రాజధాని నిర్మాణ పనులు పూర్తిచేయడానికి సీఆర్‌డీఏ ఒక టైమ్‌ టేబుల్‌ను రూపొందించుకుంది. ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్న పనులన్నింటినీ గరిష్ఠంగా మూడేళ్లలో పూర్తి చేయాలని, రాజధానికి ఒక రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్షేత్ర స్థాయిలో ఏ ప్రాజెక్టు ఎంత సమయంలో పూర్తి చేయాలన్న కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఇప్పటికే పిలిచిన రూ. 20 వేల కోట్ల విలువైన టెండర్లను ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల కోడ్‌ ముగిసే మార్చి 8న లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్స్‌ (ఎల్‌ఓఏ) ఇచ్చి మార్చి 15 లోపు ఆ టెండర్లను ఖరారు చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఉగాది నాటికి అమరావతిలో సీఆర్‌డీఏ కాంప్లెక్స్‌లో పలు సంస్థలు విధులు నిర్వహించేలా పనులు పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ తొలి లక్ష్యంగా నిర్దేశించుకుంది.


ఇక్కడే సీఆర్‌డీఏ, ఏడీసీతో పాటు మునిసిపల్‌ పట్టణాభివృద్ధి సంస్థ, కమిషనర్‌ అండ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లాన్‌, మునిసిపల్‌ మంత్రి కార్యాలయం ఇతర మునిసిపల్‌ సంబంధిత కార్యాలయాలన్నీ కొలువుతీరతాయి. ఆ తర్వాత గరిష్ఠంగా ఏడాదిన్నరలోపు అఖిలభారత సర్వీసు (ఏఐఎస్‌), ఎన్‌జీఓ, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ టవర్స్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీల భవన నిర్మాణ పనులను పూర్తి చేయనుంది. రాజధానిలో ట్రంక్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌లో భాగంగా నిర్మించే రోడ్లను ఏడాదిన్నరలో పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకుంది. రాజధానిలో ఎల్‌పీఎస్‌ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనను కూడా గరిష్ఠంగా ఏడాదిన్నరలోపు పూర్తి చేయనున్నారు. ఇక అమరావతి రాజధానిలో అత్యంత ప్రధానమైన సచివాలయం జీఏడీ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించి ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ ఐకానిక్‌ బిల్డింగ్‌లను గరిష్ఠంగా రెండున్నరేళ్లలో నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే.. అమరావతిలో కేంద్ర సంస్థలకు భూ కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేసి పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. కేంద్ర సంస్థలకు మొత్తంగా 1,278 ఎకరాలను కేటాయించారు. త్వరలో క్యాబినెట్‌ ముందుకు తీసుకువెళ్లి ఈ కేటాయింపులకు ఆమోదం పొందనున్నారు.


రుణ ప్రయత్నాలన్నీ కొలిక్కి

అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ఇప్పటి వరకు రూ. 31 వేల కోట్లను రుణంగా తీసుకోవాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి రూ. 15 వేల కోట్ల రుణం ఖరారు కాగా, హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల రుణం మంజూరైంది. వీటితో పాటు కేఎ్‌ఫడబ్ల్యూ నుంచి మరో రూ. 5 వేల కోట్ల రుణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే రూ. 26 వేల కోట్ల రుణానికి లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో పాటు హడ్కో మరో రూ. 5 వేల కోట్ల రుణాన్ని ఇవ్వటానికి ఆసక్తి చూపిస్తోంది.

హెల్త్‌సిటీలో ప్రముఖ ఆస్పత్రులు

నవ నగరాల్లో భాగంగా రాజధానిలో నిర్మించే హెల్త్‌సిటీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఆస్పత్రులకు భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి, ఎల్‌వీ ప్రసాద్‌, మేదాంత, వోక్‌హార్డ్‌ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చారు. కాగా, రాజధానిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను సీఆర్‌డీఏ రూపొందిస్తోంది.


రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాలకు టెండర్లు

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ప్రకారం ఇచ్చే ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో ఎన్‌సీసీ, ఎల్‌అండ్‌టీ, మేగా వంటి సంస్థలు తమ బిడ్లను దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మార్చి 15వ తేదీ లోపు టెండర్లను ఖరారు చేస్తారు. ఇక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు విషయంలో సీఆర్‌డీఏ అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సూచనలను కన్సల్టెంట్‌కు సూచించారు. దీని ప్రకారం డిజైన్‌ వచ్చాక.. అన్ని జాతీయ రహదారులను కనెక్ట్‌ చేసేలా సీఆర్‌డీఏ చర్యలు తీసుకోనుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 05:28 AM