సమన్వయంతో పని చేయండి
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:30 PM
జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర కుటుంబ, వైద్య, ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు.
ఫ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్
ఫ జానంపేట పీహెచ్సీ పరిశీలన
మహబూబ్నగర్(వైద్యవిభాగం), ఏప్రిల్ 18 : జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర కుటుంబ, వైద్య, ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా జానంపేట పీహెచ్సీని సందర్శించి అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఎంఅండ్హెచ్వో, ప్రోగ్రాం అధికారులు, ఇతర వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతీ స్కానింగ్ సెంటర్లో ఈ విషయంపై బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. డెమో అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని, డ్రై డే, ఫ్రై డే పాటించాలన్నారు. ప్రతీ గర్భిణి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలని, కాన్పు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించాలని, ఏఎన్సీ చెకప్లు క్రమం తప్పకుండా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డీఎఅండ్హెచ్వో డాక్టర్ శ్రీధర్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ భాస్కర్నాయక్, డాక్టర్ శంకర్, డాక్టర్ రఫీక్, డాక్టర్ శశికాంత్, డాక్టర్ సంధ్యకిరణ్మయి, డెమో డాక్టర్ తిరుపతిరావు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఫ అంతకుముందు జానంపేట పీహెచ్సీ పరిశీలించిన డాక్టర్ రవీందర్ నాయక్ అక్కడ మెటర్నల్ మార్భిలిటి క్లీనిక్లు, ల్యాబ్లు, ఫార్మసి నిర్వహణను తనిఖీ చేశారు. పీహెచ్సీలో అమలు చేస్తున్న పథకాలు, వారి రికార్డులను పరిశీలించారు. ప్రతీనెల పీహెచ్సీలలో డెలివరీలు పెంచాలని, ఏఎన్సీ చెకప్లు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడ చికిత్సపొందుతున్న ఫుడ్పాయిజన్ బాధితులతో వైద్య సేవలు అందే తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎఅండ్హెచ్వో డాక్టర్ కృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్లు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ షబానా తదితరులు ఉన్నారు.