ఎవరా ప్రజాప్రతినిధులు..?
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:27 AM
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం ప్లాంటు ఇసుక, కంకర, డస్టు కాంట్రాక్టులపై గత ప్రభుత్వం తరహాలోనే తమతోనూ ‘వ్యవహారాలు’ జరపాలని
![ఎవరా ప్రజాప్రతినిధులు..?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
‘మాకేంటి?’ కథనంపై సర్వత్రా చర్చ.. ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా
నల్లగొండ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం ప్లాంటు ఇసుక, కంకర, డస్టు కాంట్రాక్టులపై గత ప్రభుత్వం తరహాలోనే తమతోనూ ‘వ్యవహారాలు’ జరపాలని డిమాండ్ చేస్తున్న ఆ ప్రజా ప్రతినిధులు ఎవరంటూ స్థానికంగా చర్చనీయాంశమైంది. యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రంపై రాజకీయ క్రీనీడ.. నిలిచిన పనుల నేపథ్యంలో ‘మాకేంటి!?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో సోమవారం ప్రచురితమైన కథనంపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చ జరిగింది. యాదాద్రి పవర్ప్లాంటులో కాంట్రాక్టర్లతో సమావేశమైన నేత ఎవరు? కాంటా్ట్రక్టర్లను ఒత్తిడి చేస్తున్న కీలక, స్థానిక ప్రజాప్రతినిధులెవరు? అనే అంశంపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నేతలు ఒకరికొకరు ఆరా తీశారు. పవర్ ప్లాంటుపై రాజకీయాధిపత్యంతో పాటు, తమ పార్టీకి చెందినవారికే ఇసుక, కంకర సరఫరా ఒప్పందాలు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న నేతల వ్యవహారం బయటకు ఎలా పొక్కిందనే అంశంపై అధికారవర్గాలు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులను ఆరా తీసినట్లు తెలిసింది. మరోవైపు పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ కథనంపై ఆరా తీసినట్లు సమాచారం. ప్లాంటులో పనులు నిలిచిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలతో పూర్తిస్థాయి నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిసింది.