Share News

మూగజీవాలు తరలిస్తున్న వాహనం పట్టివేత

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:59 PM

భూదాన్‌పోచంపల్లి మీదుగా అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న గోవులు, పశువులను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు.

మూగజీవాలు తరలిస్తున్న వాహనం పట్టివేత

భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్‌ 14: భూదాన్‌పోచంపల్లి మీదుగా అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న గోవులు, పశువులను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో గుట్టుచప్పుడు కాకుండా డీసీఎంలో హైదరాబాద్‌కు మూగజీవాలను తరలిస్తుండగా మార్గంమధ్యలో పిలాయిపల్లి వద్ద కాలువలో వాహనం దిగబడింది. గ్రామస్థులు డీసీఎంను పరిశీలించగా అందులో కొన్నిమూగజీవాలు ఉన్నట్లు గుర్తించారు. అటుగా వెళుతున్న పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 24ఎద్దులు, రెండు ఆవులు, గేదెలున్నాయని గుర్తించారు. పిలాయిపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ పడాల సతీ్‌షచారితోపాటు గ్రామస్థులు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. అక్కడ పోలీసులకు పట్టుపడిన డ్రైవర్‌ బానోతు అశోక్‌, మరోవ్యక్తి అష్రఫుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని బంజారా సంతలో అజీమ్‌ అనే వ్యక్తి పశువులను కొనుగోలు చేశాడని, వీటిని హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు చెందిన అష్రఫ్‌ వద్దకు తరలిస్తున్నట్లు తెలిపారు. వాహనంలోని మూగజీవాలను హైదరాబాద్‌లోని జియాగూడలోని సమర్థ కామధేను గోశాలకు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 14 , 2024 | 11:59 PM