నామినేషన్లకు వేళాయె!
ABN , Publish Date - Apr 16 , 2024 | 11:43 PM
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టం రేపు ప్రారంభం కాబోతోంది. చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలకు ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలు కానుంది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు ఉన్నా ప్రధాన పార్టీల అభ్యర్థులు అంతకు ముందే మంచి ముహూర్తం చూసుకుని దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా , నామినేషన్ల ఘట్టాన్ని ఎవరికి వారు అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించి వారి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయాలని అభ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
రేపే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్
నామినేషన్ల స్వీకరణకు సర్వంసిద్ధం!
ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ ఆర్వో ఆఫీస్,
మేడ్చల్ కలెక్టరేట్లో మల్కాజ్గిరి పార్లమెంటు ఆర్వో కార్యాలయం ఏర్పాటు
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టం రేపు ప్రారంభం కాబోతోంది. చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలకు ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలు కానుంది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు ఉన్నా ప్రధాన పార్టీల అభ్యర్థులు అంతకు ముందే మంచి ముహూర్తం చూసుకుని దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా , నామినేషన్ల ఘట్టాన్ని ఎవరికి వారు అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించి వారి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయాలని అభ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఆంధ్రజ్యోతి, వికారాబాద్/మేడ్చల్/రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 16 : సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం రేపు ప్రారంభం కాబోతోంది. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. సెలవు రోజు ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
రెండు చోట్ల నామినేషన్లు స్వీకరణ
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్లను రిటర్నింగ్ అధికారులు జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 25వ తేదీ చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉప సంహరించుకునేందుకు 29వ తేదీ వరకు గడువు ఉంది. నామినేషన్ల గడువు ముగిసిన వెంటనే తుది పోటీల్లో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారనేది స్పష్టత రానుంది. మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలంలోనే...
ఇదిలాఉంటే, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి సంబంఽధించిన నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో జరగనుంది. వాస్తవానికి చేవెళ్ల పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉండడంతో విచిత్రి పరిస్థితి ఏర్పడింది. దీంతో చేవెళ్ల పార్లమెంట్ ఆర్వో కార్యాలయాన్ని రాజేంద్రనగర్ తహసీల్ధార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని సమీక్షలు, మీడియా సమావేశాలు ఇక్కడ నుంచే నిర్వహిస్తున్నారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబఽంధించి శామీర్పేట్ సమీపంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు.
మంచి ముహూర్త బలం చూసుకుని ..
ఇదిలా ఉంటే, మంచి ముహూర్త బలం చూసుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు సన్పద్ధమవుతున్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ఖరారైన విషయం తెలిసిందే. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభం కానుండగా, 19, 21, 22, 24వ తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి, స్వీకరించడానికి అవకాశం లేదు. 19, 22, 24వ తేదీల్లో ఎక్కువ నామినేషన్లు అందజేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆరోజుల్లో అభ్యర్థులు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. చివరి రోజు తమ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీలతో మరో సెట్ నామినేషన్ దాఖలు చేయాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. నామినేషన్ల ఘట్టాన్ని ఎవరికి వారు అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలను ఆహ్వానించి వారి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయాలని వారు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శశాంక
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు
మీడియా సమాశంలో రంగారెడ్డి కలెక్టర్ శశాంక
ఎన్నికల కోడ్ ఉల్లంఘించే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియపై మంగళవారం రాజేంద్రనగర్ ఆర్వో కార్యాలయంలో నిర్వహించిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటుఎన్నికలను జిల్లాలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. కోడ్ ఉల్లంఘన గురించి ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సీ-విజిల్ యాప్ ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందన్నారు. ఈ యాప్ ద్వారా కోడ్ ఉల్లంఘన అంశాలు లైవ్ ఫోటోలు, వీడియోలు తీసి ఈ.సీ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఎన్నికల నియమావళి అమలు తీరు పర్యవేక్షణకై జిల్లా స్థాయిలో ఇంటెలిజెన్స్ కమిటీని నెలకొల్పనున్నట్లు చెప్పారు.
చేవెళ్ల ఎంపీ పరిధిలో 29,28,186 ఓటర్లు
చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గం కింద చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయని తెలిపారు. ఏడు నియోజక వర్గాలలో 29,28,186 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 2,824 పోలింగ్ కేంద్రాలు, 53 సహాయక పోలింగ్ కేంద్రాలు మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 13,443 పీవోలకు ఏపీవో, ఓపీవోలు ఉన్నారన్నారు. 259 సెక్టోరల్ అధికారులు ఉన్నారని ఒక్కో సెక్టోరల్ అధికారి 11 పోలింగ్ కేంద్రాలు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.
మొదటి ర్యాండమైజేషన్ పక్రియ పూర్తి
మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించి పీవోలకు ఏపీవో, ఓిపీవోలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్లకు మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉన్న దగ్గరే రిసెప్షన్ సెంటర్ కూడా ఉంటుందని తెలిపారు.
చేవెళ్లలోని బీఎ్సఐటీలో కౌంటింగ్ సెంటర్..
కౌంటింగ్ కేంద్రం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ నందు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ సెంటర్ వద్ద స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఉంటాయని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద బారీకేడ్లు, సివిల్ పనులు, కావలసిన వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పటి వరకు రూ.2.61 లక్షల నగదు సీజ్
ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో రూ.2.61 లక్షల నగదును, రూ.4.18 లక్షల విలువగల వెండి,1.28 లక్షల విలువగల ఫ్యాబ్రీస్, 69.51 లక్షల విలువగల మద్యం, 3.28 లక్షల విలువగల డ్రగ్స్/నార్కొటిక్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీసు బలగాలతో పాటు, ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. పరిస్థితులను బట్టి పోలింగ్ నాటికి వీటి సంఖ్య మారే అవకాశాలు ఉంటాయన్నారు. ఎఆర్వోలు జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరుగుతుంది అని అన్నారు. కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు అధికారులను నియమించామని అన్నారు.
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్
పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణలో పోలింగ్ నిబంధనలు, మాక్ పోల్ నిర్వహించే విధానం, పోలింగ్ రోజు నిర్వర్తించవలసిన విధులపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తామని తెలిపారు. పీవోలు, ఎపివోలు, ఓపివోలు, పోలీస్ సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మీడియాసమావేశంలో సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, ఆర్డీవో వెంకట్రెడ్డి, తహసీల్దార్ రాములు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.