మిర్చి ధర ఢమాల్!
ABN , Publish Date - Apr 04 , 2024 | 05:22 AM
రైతులకు ఏటా సిరులు కురిపిస్తున్న ఎర్ర బంగారం మిర్చి.. ఈ సంవత్సరం ఊరించి ఉసూరుమనిపించింది. సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ప్రారంభమైన ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టి
మార్కెట్లలో సీజన్ కనిష్ఠానికి రేట్లు
ఖమ్మంలో ఒక్కరోజే రూ.1,000 కిందకు
వరంగల్, గుంటూరులోనూ ఇదే పరిస్థితి
మిర్చి రైతుల్లో ఆందోళన
విదేశీ డిమాండ్ తగ్గడం వల్లేనా..!
సీజన్ ప్రారంభం నుంచి 5 వేలు పడిన ధర
ఖమ్మం మార్కెట్, ఏప్రిల్ 3: రైతులకు ఏటా సిరులు కురిపిస్తున్న ఎర్ర బంగారం మిర్చి.. ఈ సంవత్సరం ఊరించి ఉసూరుమనిపించింది. సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ప్రారంభమైన ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కనిష్ఠానికి పడిపోయాయి. సాధారణంగా పంట తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉండగా... ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో పాటు ధర కూడా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఖమ్మం మార్కెట్లో సీజన్ ప్రారంభంలో గరిష్ఠంగా రూ.24 వేలు పలుకగా సీజన్ చివరిలో రూ.20 వేల వరకు చేరింది. ఈ సీజన్ ప్రారంభమైన డిసెంబరులో క్వింటాల్ రూ.22 వేల గరిష్ఠ ధర లభించగా.. ప్రస్తుతం రూ.18,700 జెండాపాటకు చేరుకుంది. వ్యాపారులు నాణ్యతను బట్టి రూ.15 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన సీజన్ ప్రారంభంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్వింటాల్కు రూ.5 వేల వరకు నష్టపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి..
మిర్చి ధరల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం మార్కెట్లో బుధవారం తేజా రకం మిర్చికి ఒక్కరోజే రూ.1,000 ధర పడిపోయింది. మార్కెట్లో క్వింటాల్ డీలక్స్ క్వాలిటీ మిర్చికి రూ.18,700 జెండాపాట పలుకగా మిగితా రకాలను వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటాల్ రూ.11 వేల నుంచి రూ.16,500 వరకు కొనుగోలు చేశారు. ముందురోజు క్వింటాల్ రూ.19,500 పలికిన మిర్చి ధర బుధవారం ఒక్కసారిగా రూ.1,000 తగ్గింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ తేజా మిర్చి రూ.18,600 జెండాపాట నిర్ణయించగా, గుంటూరు మార్కెట్లో క్వింటాల్ రూ.19 వేలు, కర్నూలులో గరిష్ఠంగా రూ.14,519 పలికింది. కర్నూలు జిల్లాలోని ఆదోని మార్కెట్లో గరిష్ఠంగా రూ.12,101 లభించగా సగటు ధర రూ.8,001 పలికింది. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరలు దక్కకపోవడంతో మళ్లీ అప్పుల పాలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యత తగ్గిన మూడో కోత పంట..
మార్కెట్లో మిర్చి ధరలు ఇంత భారీస్థాయిలో తగ్గడానికి పంట నాణ్యత తగ్గడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మిర్చి పంటపై సీజన్ ప్రారంభంలో తామర పురుగు విజృంభించగా, కాత పూత దశలో మిచౌంగ్ తుఫాన్తో పంట దెబ్బతిన్నది. మరోవైపు పంట ద్వితీయార్ధంలో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొనడంతో దిగుబడులు, పంట నాణ్యతపై ప్రభావం చూపింది. ప్రస్తుతం మార్కెట్కు వస్తున్న మూడో కోత కాయలకు చైనా, సింగపూర్, మలేసియా తదితర దేశాలు ఆర్డర్లు తీసుకోవడం లేదు. అక్కడ డిమాండ్ లేకపోవడంతోనే ధరలు దిగొస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం పరిసరాల్లో ఉన్న ముదిగొండ, మన్నెగూడెం గ్రామాల వద్ద ఉన్న చైనాకు చెందిన (మిర్చి నుంచి ఆయిల్ తీసే) ఫ్యాక్టరీలు సైతం ఈ ఏడాది తెరవకపోవడంతో మిర్చి ధరలపై ప్రభావం చూపిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు కోల్డ్ స్టోరేజీల్లో తమ పంటను నిల్వ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.