Share News

మిగిలిన ఇద్దరూరాజీనామా బాటలో!?

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:25 AM

టీఎ్‌సపీఎస్సీలో మిగిలిన ఇద్దరు సభ్యులు కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో గవర్నర్‌ను కలుసుకుని వారు తమ రాజీనామాలను సమర్పించాలని భావిస్తున్నారు.

మిగిలిన ఇద్దరూరాజీనామా బాటలో!?

వైదొలగే యోచనలో టీఎస్‌పీఎస్సీ సభ్యులు

కమిషన్‌ చైర్మన్‌ పదవి కోసం

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సపీఎస్సీలో మిగిలిన ఇద్దరు సభ్యులు కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో గవర్నర్‌ను కలుసుకుని వారు తమ రాజీనామాలను సమర్పించాలని భావిస్తున్నారు. చైర్మన్‌, ముగ్గురు సభ్యులు రాజీనామాలు చేసినా.. కోట్ల అరుణ కుమారి, సుమిత్ర తనోబా కొనసాగుతున్నారు. చైర్మన్‌, ఇతర సభ్యుల రాజీనామాలను గవర్నర్‌ బుధవారం ఆమోదించిన నేపథ్యంలో.. వీరు కూడా తమ రాజీనామాలను సమర్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వాటిని కూడా గవర్నర్‌ ఆమోదిస్తే.. టీఎ్‌సపీఎస్సీలో మొత్తం సభ్యుల పోస్టులు ఖాళీ అవుతాయి. అప్పుడు కమిషన్‌ ప్రక్షాళనకు పూర్తిస్థాయిలో మార్గం సుగమం అవుతుంది. పూర్తిస్థాయిలో కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కమిషన్‌లో మొత్తం 11 మంది సభ్యులు, చైర్మన్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొత్తగా నియమించే చైర్మన్‌, సభ్యుల విషయంలో చాలా జాగ్రత్త చర్యల్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా రంగాల్లోని నిపుణులతో ఈ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది.

వెబ్‌సైట్‌లో వారి ఫొటోలే

చైర్మన్‌, సభ్యులు చేసిన రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత కూడా టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో వారి వివరాలు, ఫొటోలే దర్శనమిస్తున్నాయి. సాధారణంగా సభ్యులు, లేదా చైౖర్మన్‌ పదవీ కాలం ముగిసినా.. రాజీనామాలు ఆమోదం పొందినా.. వెంటనే వారి వివరాలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలి. కానీ, గురువారం రాత్రి వరకూ వెబ్‌సైట్లో వారి ఫొటోలు, వివరాలే ఉన్నాయి. దాంతో, నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడంలో ఘోరంగా విఫలమైన కమిషన్‌ కనీసం వెబ్‌సైట్‌ లోని వివరాలనైనా అప్‌డేట్‌ చేయారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవి కోసం ఢిల్లీలో పైరవీ!

ఖాళీ అయిన టీఎస్పీఎస్సీ చైర్మన్‌ పదవి కోసం పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఓ ప్రొఫెసర్‌ కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఆయన ఢిల్లీలో ఉంటూ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయన ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో కొనసాగుతున్నారు. అలాగే, ఓ యూనివర్సిటీకి ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా కూడా వ్యవహ రిస్తున్నారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటూ వర్సిటీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఆ యూనివర్సిటీలో అనేక వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఇతర వసతుల విషయంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆయనను ఇన్‌చార్జి వీసీగా నియమించిన తర్వాత కూడా ఆ సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదన్న వాదన ఉంది.

Updated Date - Jan 12 , 2024 | 05:26 AM